చిరు పిలిస్తే వస్తా, జయసుధ ఫ్రెండ్ కాబట్టి: జయప్రద
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి పిలిస్తే తాను సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేసే విషయాన్ని ఆలోచిస్తానని రాష్ట్రీయ లోకదళ్ నేత, సినీ నటి జయప్రద అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ సూచిస్తే తాను కాంగ్రెసుకు సీమాంధ్రలో ప్రచారం చేస్తానని ఆమె చెప్పారు. ఓ ప్రముఖ తెలుగ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పారు. జయసుధ తనకు మంచి స్నేహితురాలు కాబట్టి ఆమె కోసం తాను ప్రచారం చేశానని జయప్రద చెప్పారు.
జయసుధను ఆమె అమయకురాలిగా అభివర్ణించారు. జయప్రద, జయసుధ ఏక కాలంలో తెలుగు సినిమాల్లో పోటీ పడి నటించిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు తెలివైనవారిని, ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసునని జయప్రద అన్నారు. తెలుగు ప్రజలు తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు ప్రదర్శించారని ఆమె చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా తనను ఆదరించారని ఆమె చెప్పారు. తాను సినిమాల్లో చేసిన పాత్రలు ప్రజల మనస్సులో ఉన్నాయని, దానివల్ల తనను ఓటర్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాలేదని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని జయప్రద వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ఆజంఖాన్పై ఆంక్షలు విధించినందుకు తాను ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. తన ఆత్మ ఆంధ్రప్రదేశ్లో ఉందని ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి పోటీ చేయాలని అనుకున్న మాట వాస్తవమేనని, అయితే పరిస్థితుల ప్రబావం వల్ల అది కుదరలేదని జయప్రద చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర విభజన రాజకీయాలు తనకు ఆ అవకాశం లేకుండా చేశాయని ఆమె చెప్పారు. ప్రజల ప్రేమ, క్రమశిక్షణ, వ్యాయామం కారణంగానే తన గ్లామర్ తరగడం లేదని ఆమె చెప్పారు. తనకు వచ్చిన కష్టాలు ఏ మహిళకు కూడా వచ్చి ఉండవేమోనని ఆమె అన్నారు. కాలం కలిసి వస్తే భవిష్యత్తులో తెలుగు ప్రాంతం నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పారు. నటి శ్రీదేవితో తనకున్న విభేదాల గురించి కూడా ఆమె మాట్లాడారు.