ముందస్తు ఎన్నికలు వస్తే...టిడిపిదే వన్ సైడ్ విజయం:మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
విజయవాడ:ముందస్తు ఎన్నికల గురించి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే టిడిపి వన్సైడ్ విజయాన్ని చూడబోతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పుల్లారావు వెళుతూ మార్గమధ్యంలో హనుమాన్జంక్షన్ టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రిని నిర్ణయించే శక్తి చంద్రబాబుకు ఉండాలని...ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని పుల్లారావు చెప్పారు. అందువల్ల 25 పార్లమెంట్ స్థానాలు టీడీపీ కైవసం చేసుకున్నా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు.
ప్రతిపక్షనేత జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా...అలాగే కొత్త పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్ని బస్సు యాత్రలు చేసినా ప్రజల్ని మెప్పించే పరిస్థితిలో లేరని మంత్రి పుల్లారావు తేల్చేశారు. చౌకదుకాణాల్లో జూలై నుంచి ప్రతి రేషన్ కార్డుకు రెండు కిలోల కందిపప్పు ఇవ్వాలని నిర్ణయించినట్లు పుల్లారావు ఈ సమావేశంలో చెప్పారు.
దేశంలో పౌరసరఫరాల శాఖ ద్వారా పంచదార సరఫరా నిలిపివేసినా అరకిలో ఇస్తున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి ఉందన్నారు. ఎక్కడా ఇవ్వని విధంగా రూ.10కి అరకిలో పంచదార ఇస్తున్నట్లు మంత్రి పుల్లారావు తెలిపారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల నుంచి ప్రతి కార్డుకు కిరోసిన్, పామోలిన్ కూడా ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11న 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.