మద్యం అక్రమ రవాణా కేసు: ఏపీకి చెందిన ఇద్దరు ఎస్ఈబీ ఎస్సైలు,కానిస్టేబుళ్లు అరెస్ట్
ఏపీలో అక్రమ మద్యం రవాణా కు చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులను రంగంలోకి దింపింది . ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యనిషేధం అమలు దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు. దీంతో ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా అవుతోంది. మద్యం అక్రమ రవాణాకు ఏపీ పోలీసులు కూడా సహకరిస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ మద్యం రవాణాలో ఎస్ఈబీ పోలీసుల హస్తం
ఈ క్రమంలోనే ఇటీవల అక్రమ మద్యం రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారించగా ఏపీ లోని ఇద్దరు ఎస్ఐలు ,ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం బట్టబయలైంది. కర్ణాటకలోని తుంకూరు జిల్లా పావగడ తాలూకా లోని జాలేడు గ్రామం నుండి ఇద్దరు వ్యక్తులు ఏపీలోకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పోలీసులకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కు చెందిన ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సహకరించినట్లుగా పేర్కొన్నారు.
ఇద్దు ఎస్సై లు , కానిస్టేబుల్స్ అరెస్ట్ .. రిమాండ్ కు తరలింపు
ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుళ్లు 50వేల రూపాయలు లంచం తీసుకుని తమకు సహకారం అందిస్తున్నట్లుగా వారు తెలిపారు. దీంతో విచారణ జరిపిన పోలీసులకు ఆ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కి చెందిన ఎస్ఐలు జిలాన్ భాష, శివ ప్రసాద్ లతో పాటుగా కానిస్టేబుళ్ళు మోహన్, మురళీకృష్ణ లను అరెస్ట్ చేసినట్టు ఎస్పి రామ్ మోహన్ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు.
Recommended Video
అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలే !!
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా అక్రమ మద్యం రవాణా జరుగుతోంది. ఇటు తెలంగాణా రాష్ట్రం నుండి , కర్ణాటక నుండి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది .దానికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడితే అటు పోలీసులు అయినా ఎవరినైనా క్షమించేది లేదని తాజాగా జరిగిన ఈ ఉదంతం ద్వారా స్పష్టంగా చెబుతోంది ఏపీ ప్రభుత్వం. అక్రమాలకు చెక్ పెట్టాల్సిన అధికారులు, లంచాలకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరించడం దారుణమైన చర్యగా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కఠిన చర్యలకు ఉపక్రమించింది.