దొంగచాటుగా ప్రయాణాలు .. పోలీసులకు ఇదో తలనొప్పి .. ఆలోచించాల్సింది ప్రభుత్వాలే !!
భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ప్రజలు ఎన్నడూ ఊహించని కష్టాలను తెచ్చి పెట్టింది . అనుకోకుండా వేరే ఊరికి వెళ్లి అక్కడే లాక్ డౌన్ తో ఇరుక్కుపోయిన వారు సొంతూర్లకు వెళ్ళటానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇక వీరి దొంగ చాటు ప్రయాణాలను ఆపటానికి పోలీసులు కూడా నానా ఇబ్బందులూ పడుతున్నారు .
చైనా పేరెత్తితేనే భయపడుతున్న జనం .. అదే చైనా వాళ్ళు కనిపిస్తే ఇక హడలే !!
నిత్యావసర వస్తువులను రవాణా చేసే లారీలను ఆసరాగా చేసుకుని ప్రయాణాలు
ఏదో పని మీద వెళ్లి సడన్ గా విధించిన లాక్ డౌన్ తో ఒక రోజు , రెండు రోజులైతే సర్దుకునేవాళ్ళు కానీ ఏకంగా మే 3 వరకు ఉన్న చోటే ఉండాలంటే వారికి అక్కడ ఆర్ధిక ఇబ్బంది, వసతి లేకపోవటం, కనీసం తినటానికి తిండి, కట్టుకోటానికి బట్టలు లేకపోవటం వంటి కారణాలు ఎలాగైనా తమ సొంత వూరికి చేరాలనే భావన కలిగిస్తున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తు రవాణా జరుగుతున్న నేపధ్యంలో ఆ లారీలను ఆసరాగా చేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు చాలా మంది . ఇక ఈ పరిణామాలు పోలీసులకు , అధికార యంత్రాంగానికి పెద్ద తలనొప్పిగా మారాయి .
సొంత ఊరికి, సొంత ఇంటికి వెళ్ళాలంటేనే దొంగల్లా దాక్కుని
మన దేశంలో మన రాష్ట్రంలో మన సొంత ఇంటికి వెళ్ళాలంటే దొంగల్లా వెళ్ళాల్సిన పరిస్థితి ఏమిటి భగవంతుడా అని కొందరు బాధ పడుతుంటే, కొందరు మాత్రం ఎలాగోలా ఇంటికి చేరితే చాలు అని నానా ప్రయత్నాలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికి క్వారంటైన్ కు వెళ్తున్నారు. తమను ఇళ్ళకు చేర్చే నాధుడే లేరా అని చాలా బాధ పడుతున్నారు . ప్రభుత్వం ఇలా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సొంత గ్రామాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ బతుకు బస్ స్టాండ్ లా మారుతుందని చాలా ఆవేదన వెళ్లగక్కుతున్నారు .
అంబులెన్స్ లు, నిత్యావసరాల లారీలలో దొంగచాటు ప్రయాణాలు
ఇక నిత్యం నిత్యావసరాల మాటున ప్రయాణాలు సాగిస్తునారు చాలామంది. ఇక కాలి నడకన కూడా సొంత గ్రామాలకు వెళ్ళటానికి సాహసిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ప్రతి రోజూ ఇలా వివిధ వాహనాల ద్వారా ప్రయాణం చేస్తున్న వారు పోలీసులకు పట్టుబడుతున్నారు. కొందరు అంబులెన్స్ లను, ఆశ్రయిస్తే కొందరు నిత్యావసర వస్తువులను రవాణా చేసే లారీలలో ప్రయాణం సాగిస్తున్నారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో హైదరాబాద్కు చెందిన ఆరుగురు యువకులను పోలీసులు క్వారంటైన్కు తరలించారు.
కటక్ నుండి టెక్కలికి వచ్చిన యువకులు.. పట్టుకున్న పోలీసులు
లాక్ డౌన్ సమయంలో పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా చాలా మంది రాష్ట్రాలు, జిల్లాలు సరిహద్దులు దాటుకుంటూ పోతున్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురు ఒడిశాలోని కటక్ నుంచి శ్రీకాకుళం టెక్కలి చేరుకున్నారు. ఇక వారు అక్కడి నుంచి ఓ లారీలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు భయంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని టెక్కలి ఐతం కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్కు తరలించారు . లాక్డౌన్ సమయంలో వాళ్లు ఎలా టెక్కలి చేరుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.ఇక ఇది ఒక ఉదాహరణ మాత్రమే ..
ఇతర ప్రాంతాలలో చిక్కుకున్న వారిని గురించి ఆలోచించాల్సింది ప్రభుత్వాలే
ఇక ఈ ప్రయాణాలు నిత్య కృత్యంగా మారుతున్న నేపధ్యంలో వీటిని కంట్రోల్ చెయ్యటం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు అధికారులు . ఇక లాక్ డౌన్ తో వేరే ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు ప్రాంతాల వారీగా ప్రభుత్వమే అన్ని జాగ్రత్తలు తీసుకుని కొన్ని బస్సులను నడిపించి స్వస్థలాలకు చేరిస్తే బాగుంటుందని కోరుతున్నారు సదరు ఇతర ప్రాంతాలలో చిక్కుకున్న బాధితులు . అనుకోకుండా వెళ్లి ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఇక వారి గురించి ప్రభుత్వం ఆలోచన చేయకుంటే వారు సాగించే దొంగ చాటు ప్రయాణాలతో ప్రమాదమే .
Recommended Video