బాగా తలంటిన ఐఎంఏ: డాక్టర్ సుధాకర్ అరెస్టుపై నిజ నిర్ధారణ కమిటీ ఏం తేల్చిందంటే?
అమరావతి: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియాలజిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ను అరెస్టు చేసే విధానంలో పోలీసులు అనుసరించిన వైఖరి పట్ల అటు తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు.. భారత మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా తీవ్రంగా స్పందించింది. దీనిపై నిజ నిర్దారణ కమిటీని వేసింది. ఈ కమిటీ తన నివేదికను ఐఎంఏకు అందజేసింది కూడా. పలు కీలక అంశాలను ఈ కమిటీ తన అంతర్గత నివేదికలో పొందుపరిచింది. అటు పోలీసులు, ఇటు సుధాకర్ తీరునూ తప్పు పట్టింది. ఇరు పక్షాలకూ బాగా తలంటింది.
హైకోర్టుకు వంగలపూడి అనిత లేఖ: డాక్టర్ సుధాకర్ అరెస్టుపై సుమోటోగా కేసు: సర్కార్కు ఆదేశాలు
నడిరోడ్డు మీద అర్ధనగ్న స్థితిలో..
విశాఖపట్నం అక్కాయపాలెం వద్ద నడిరోడ్డు మీద వీరంగం సృష్టించిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను ఈ నెల 16వ తేదీన ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసులు తనను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఆయన చొక్కా చిరిగిపోయింది. అర్ధనగ్నంగా ఉన్న స్థితిలోనే పోలీసులు ఆయన చేతులను వెనక్కి విరిచికట్టి, అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఐఎంఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ..
ఈ ఉదంతం పట్ల భారత మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనిపై ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించింది. రెండు రోజుల పాటు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగించారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు. ఈ నివేదికను ఐఎంఏ వెల్లడించింది. నర్సీంపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు సమయంలో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని అభిప్రాయపడింది. ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పోలీసులు పాల్పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. లాఠీ ఛార్జీని చేయడం సరికాదని పేర్కొంది.
కేసులు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్..
నర్సీంపట్నం డాక్టర్ సుధాకర్పై పోలీసులు నమోదు చేసిన కేసులన్నింటినీ పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆయనపై నమోదు చేసిన కేసులు తీవ్రమైనవిగా పరిగణించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు పీపీఈ కిట్లను అందజేయడంపై స్పందించినందుకు నిరసనగా ఆయన పట్ల ఇలా ప్రవర్తించడం సరి కాదని స్పష్టం చేసింది. ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
డాక్టర్ సుధాకర్ క్షమాపణ చెప్పాల్సిందే..
అదే సమయంలో నర్సీంపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహరించిన తీరు పట్ల కూడా ఐఎంఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన ప్రవర్తన సరిగా లేదని పేర్కొంది. ఓ డాక్టర్గా ఆయన అలా ప్రవర్తించి ఉండకూడదని వెల్లడించింది. దీనిపై డాక్టర్ సుధాకర్ వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు క్షమాపణలు చెప్పాలని సూచించింది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ గౌరవ కార్యదర్శి డాక్టర్ పీ ఫణిధర్ ఈ వివరాలను వెల్లడించారు. డాక్టర్ ప్రవర్తనను తాము సమర్థించట్లేదని ఈ నివేదికలో స్పష్టం చేశారు.
కాస్సేపట్లో హైకోర్టులో..
ఇదిలావుండగా- నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ను కాస్సేపట్లో హైకోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయన అరెస్టు ఉదంతపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ సందర్భంగా పలు అంశాలు వెలుగులోకి రానున్నాయని అంటున్నారు. ప్రభుత్వం, పోలీసు అధికారుల వాదన ఏమిటనేది కాస్సేపట్లో స్పష్టమౌతుంది.
Recommended Video