తీవ్ర అల్పపీడనం, మళ్లీ భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!
ఏపీలో పలు జిల్లాలను వర్షాలు వీడటం లేదు. వాతావరణం లో వస్తున్న అనూహ్య మార్పులతో వర్షాలు కురుస్తున్నాయి. వరుస అల్పపీడనాలతో వర్షాల ముప్పు తప్పటం లేదు. తాజాగా పశ్చిమ మధ్య - నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఏపీకి మరో సారి భారీ వర్షాల పై హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో అల్ప పీడనం సముద్రంలోనే క్రమంగా బలహీనపడనుందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం వల్ల మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో బొబ్బిలి, పార్వతీపురంలో నాలుగు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.

అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండడంతో తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘా వృతమై ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి.
కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల మేర తగ్గినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.












Click it and Unblock the Notifications