తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లటి కబురు..!!
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయం అధిక ఉష్ణోగ్రతలు..సాయంత్రం తరువాత ఈదురు గాలులు..వర్షాలు కురుస్తున్నాయి. రోహిణీ కార్తె సమయంలో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు కూడా దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. నేటి నుంచి మూడు రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రుతుపవనాలకు అనుకూలం:భారీ ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ఈ రోజు (24వ తేదీ) అనకాపల్లి, వైఎస్సార్ , సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. ద్రోణి కారణంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని తొమ్మది మండలాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

రెండు రోజులు వర్షాలు:ఏపీలో ఇప్పటికే దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ రెండు, మూడు రోజులు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే చాన్స్ ఉంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
భిన్న వాతావరణం:ఏపీలోని మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో 43.4 డిగ్రీలు, అమరావతిలో 43.5, కొత్తవలసలో 41.9, వీరపునాయునిపల్లిలో 41.1, ఎర్రగుంట్లలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు, మూడు రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అటు ఎండలు..ఇటు వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో కనసాగుతున్న వాతావరణం నడుమ వాతావరణ శాఖ తాజా సమాచారం వెల్లడించింది.












Click it and Unblock the Notifications