ఉపరితల ఆవర్తనం - ఈ జిల్లాలకు భారీ వర్షాల పై తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావం కారణంగా రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ రోజు (ఆగస్టు 21) నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వర్షాల జోరు కొనసాగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడతాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
అదే విధంగా ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈ సారి లోటు వర్షపాతం నమోదవుతోంది. గత ఏడాది కంటే సాధారణ వర్షపాతం 20 శాతం కంటే ఎక్కువ తగ్గింది. కాగా, ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవాకాశం ఉండటంతో వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications