సీఎం జగన్కు హైకోర్టు భారీ జలక్...ఇంగ్లీష్ మీడియం బోధనకు బ్రేకులు..జీవోలు రద్దు
ముఖ్యమంత్రి జగన్ మరో నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. దీనిపైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలతో పాటుగా పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అదే స్థాయిలో ముఖ్యమంత్రి జగన్తో సహా అధికార పార్టీ నేతలు సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో సహా కొందరు పత్రికాధిపతులపైన సీఎం జగన్ విరుచుకుపడ్డారు. పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా తాము మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంగ్లీష్ మీడియంలో బోధన
తొలి విడతలో భాగంగా ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తూ వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి ఒక తరగతి చొప్పున ఇంగ్లీష్ మీడియం బోధనను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లీష్ మీడియంలో చదువులు లేకపోతే ప్రస్తుత పోటీ యుగంలో పిల్లలు రాణించలేరన్నది అధికార పార్టీ నేతల వాదన . ఇక ఇదే అంశంపైన పేరెంట్స్ కమిటీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఉపాధ్యాయులకు శిక్షణ కోసం బ్రిడ్జి విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించింది.

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఇక బ్రిడ్జి విధానంపైన రాజకీయంగా కొందరు విమర్శలు చేయగా కొందరు జాతీయ ప్రముఖల నుంచి ప్రశంసలు అందాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల ద్వారా విద్యార్థులు నష్టపోతారని టీచింగ్ పరంగాను నైపుణ్యం పెంచకుండా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తే నష్టం జరుగుతుందంటూ చర్చలు మొదలయ్యాయి. ఇదే వాదనతో బీజేపీ నేత సుధీష్ రాంబొట్లతో పాటుగా న్యాయవాది ఇంద్రనీల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. మాధ్యమం ఎంపిక అవకాశాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన రెండు జీవోలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Recommended Video

ఈ విద్యాసంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమవుతుందా..?
దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81 మరియు 85ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు తాజా ఆదేశాలతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ తీర్పుపైన రివ్యూకు వెళ్లినా, సుప్రీం కోర్టును ఆశ్రయించినా మరో రెండు నెలల్లో మొదలయ్యే విద్యాసంవత్సరంలోగా దీనిపైన ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ఎంతవరకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తాజా తీర్పుపైన ప్రభుత్వం స్పందన ఏంటనేది ఈరోజో రేపో తెలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications