జయకు షాక్: చంద్రబాబు మంత్రదండమే కరుణానిధికి వరమైంది!
విజయవాడ/చెన్నై: సోమవారం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అధికార పీఠాలు మారనున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ప్రధానంగా తమిళనాడులో జయలలితకు తమిళ ఓటర్లు షాకిచ్చారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం వరకు జయ నేతృత్వంలోని అన్నాడీఎంకేదే మళ్లీ అధికారం అని ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి. అయితే, ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకే ఓటమి పాలవుతుందని సర్వేలు చెబుతున్నాయి.
కొన్ని సర్వేలు అయితే.. అన్నాడీఎంకే పార్టీకి దారుణంగా సీట్లు పడిపోతాయని తెలిపింది. చెన్నై వరదలు, సంక్షేమ పథకాలు, ఉచిత హామీలు తదితరాలతో పాటు డీఎంకే విజయానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
అందులో ఒకటి.. చంద్రబాబు గత ఎన్నికల్లో ఉపయోగించిన దానినే ఇప్పుడు కరుణానిధి ఉపయోగించుకున్నారని, అది వరంలా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి సంబంధించి ప్రస్తుత విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపించాయనే వాదనలు ఉన్నాయి. అయితే చంద్రబాబు రుణమాఫీ అస్త్రాన్ని వదిలారు. ముఖ్యంగా అస్త్రం వైసీపీని విపక్షంలో కూర్చోబెట్టి, టీడీపీకి అధికారం కట్టబెట్టింది.
ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటగా ఉన్న తమిళనాడులో కూడా చంద్రబాబు మంత్రదండమే నిర్ణయాత్మక శక్తిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. నిన్నటిదాకా అధికార అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినిపించగా, నిన్న పోలింగ్ ముగియగానే వెలువడ్డ సర్వేల్లో డీఎంకేదే పైచేయి అన్న మాట వినపడింది.
దాదాపుగా అన్ని సర్వేలదీ ఇదే మాట. ఈ క్రమంలో ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి.. ఏపీలో చంద్రబాబు ఉపయోగించిన అస్త్రమే ఉపయోగించారని అంటున్నారు. అప్పటిదాకా అన్నీ ఉచితం అన్న జయలలిత నినాదానికి మొగ్గు చూపినట్లు కనిపించిన తమిళ ఓటర్లు.. రుణ మాఫీపై కరుణ ఇచ్చిన హామీ వైపు మళ్లారని అంటున్నారు.