ఎపిలో తొలి హైపర్లూప్ ట్రైన్...విజయవాడ-అమరావతి రూట్ లో!
పశ్చిమ గోదావరి: ఫ్యూచర్ ట్రైన్ గా చెప్పబడుతున్న హైపర్లూప్ ట్రైన్ భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభం కానుందా?...అంటే అవుననే సమాధానం వస్తోంది. జెట్ క్రాప్ట్ కన్నా వేగంగా ప్రయాణించే ఈ వినూత్న అత్యాధునిక ట్రైన్ రైలు రవాణారంగంలోనే ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు.
ఎపికి ఈ ప్రాజెక్ట్ రానున్న విషయాన్ని స్వయంగా భారత ప్రధానమంత్రి కార్యాలయ సలహాదారుడు, టైఫాక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్ వెల్లడించడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన ఈ హైపర్లూప్ ట్రైన్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. అమరావతి-విజయవాడను అనుసంధానం చేస్తూ ఎపిలో తొలి హైపర్ లూప్ రూట్ నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.

భారతదేశంలోనే...మొట్టమొదటి ప్రాజెక్ట్...ఎపిలోనే...
భారతదేశంలోనే ఫస్ట్ హైపర్లూప్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎపిలో ప్రారంభం కానున్న విషయాన్ని స్వయంగా ప్రధాని సలహాదారు ప్రభాత్ రంజన్ వెల్లడించడం విశేషం.`పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు విద్యాసంస్థల్లో శాప్, ఇన్నోవేషొనెక్ట్స్, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా విష్ణు ఇన్నోవేషన్ సమిట్-2018 శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ సమిట్కు భారతదేశంతోపాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ప్రభాత్ రంజన్ మాట్లాడుతూ హైపర్లూప్ ట్రైన్ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే...కేవలం 6 నిమిషాల్లో...
ఈ రూట్ నిర్మితమయ్యాక అమరావతి నుంచి విజయవాడ వరకు 43 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిముషాల్లోనే ప్రయాణించవచ్చునని ప్రభాత్ రంజన్ తెలిపారు. హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ సంస్థ ఈ పనులను చూస్తుందన్నారు. జంతువులతో పనిలేకుండా కృత్రిమంగా మాంసాన్ని తయారుచేసే విధానం త్వరలోనే మన దేశంలోనూ అమలవుతోందని ప్రభాత్ రంజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పరిశోధనల్లో విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు.

మరికొన్నిఆవిష్కరణలు...వాటి వివరాలు...
2035 విజన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, మానవుడి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ప్రధాని మోడీ ఈ విజన్ 2035ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. కాలుష్య రహిత గాలి, జలం, ఆరోగ్యం ముఖ్యంగా దేశంలోని ప్రతీ పంచాయతీలో ఆరోగ్య కేంద్రం ఉండాలని, నాణ్యత కలిగిన విద్య, దేశ సంస్కృతి తదితర అంశాలే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రజలందరూ టెక్నాలజీని వినియోగించుకోవాలని ప్రభాత్ రంజన్ ఆకాంక్షించారు.

భవిష్యత్ లో భారత్...టెక్నాలజీలో ముందంజ
భారతదేశంలో 2018 నాటికే డ్రోన్లు తయారీ ప్రారంభించగా...2023 నాటికి భారత్ కు హైపర్లూప్ ట్రైన్లు, 2040 నాటికి హైపర్ చారియట్, 2030 నాటికి కిచెన్ వాక్ రోబోట్ రాబోతున్నాయన్నారు. అలాగే సహజ సిద్ధంగా బయోఫ్యూల్ ఇంధనాలను తయారు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ వాతావరణానికి ఎటువంటి రకాల పంటలు పండుతున్నాయో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో తెలుసుకుంటోందని చెప్పారు. వస్తువులను పరిశుభ్రం చేసుకోవడం, మరమ్మతులు చేయడం, పూలమొక్కలను పెంచడం వంటి పనులను జపాన్ మాదిరిగా వారంలో ఒక గంటపాటు ఆచరించాలని భావిభారత ఇంజనీర్లకు ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications