India TV-CNX: వామ్మో: టీడీపీ క్లీన్ స్వీప్
AP Exit Polls 2024: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

చివరి విడత లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.
ఏపీపై ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేసింది. మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తుందని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమికి 19 నుంచి 23 స్థానాలు లభిస్తాయని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ తెలిపింది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే లోక్సభ సీట్లు 1 నుంచి 6 వరకు మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. దీని ప్రకారం చూసుకుంటే- ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమికి దక్కే స్థానాలు 133 నుంచి 161 వరకు ఉంటాయి. టీడీపీకి ఈ స్థాయిలో సీట్లు లభిస్తాయని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ అంచనా వేయడం ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications