వనజాక్షి మీద దాడిపై విచారణ: ఉద్రిక్తత, గుమ్మడికాయంతలో ఆవగింజ లోపం: నన్నపనేని
విజయవాడ: కొద్ది నెలల క్రితం తహసీల్దార్ వనజాక్షి పైన దాడి కేసు, విచారణ నేపథ్యంలో తమ్మిలేరు వద్ద గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వనజాక్షి పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
వనజాక్షి పైన దాడి ఘటనను విచారించేందుకు శర్మ వచ్చారు. విచారణ నేపథ్యంలో తమ్మిలేరు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. దీంతో విచారణను సబ్ కలెక్టరేట్ ఆఫీసుకు మార్చారు.
గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపం సహజం: నన్నపనేని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుమ్మడికాయంత అభివృద్ధిలో ఆవగింజంత లోపాలు సహజమేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల పట్టిసీమ ప్రాజెక్టుకు గండి, తదితర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దీక్ష చేసేందుకు శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ప్రతి దానికి విమర్శించడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుందని మండిపడ్డారు.
దీక్షపై తగ్గని జగన్
ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టే తీరతానని జగన్ ప్రకటించారు. గుంటూరులో ఎంపిక చేసిన దీక్షా స్థలిని మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ప్రకటన చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు గుంటూరు ఎస్పీ అనుమతి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన దీక్షకు అడ్డు చెబుతోందని భావిస్తుని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. దీక్షా స్థలి మార్పు విషయంలో వెనుకడుగు వేసేది లేదని చెబుతున్నారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతివ్వడం లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోచోట దీక్ష చేసుకోవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications