ఇన్ సైడర్ ట్రేడింగ్ ఒక బూతు మాట..అది ఎవరన్నా తప్పే: మాజీ ఎంపీ సబ్బం హరి
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానుల ప్రకటనపై ఏపీలో రాజకీయ నేతలు ఎవరి అభిప్రాయం వారు చెప్తున్నారు. రాజకీయ కక్షసాధింపుల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని చెప్పిన మాజీ ఎంపీ సబ్బంహరి ఏపీ రాజధాని విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ రగడపై స్పందించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం బూతు పదం అన్న ఆయన ఆ మాట ఎవరు మాట్లాడినా తప్పేనని చెప్పారు. అటు టీడీపీ నాయకుల, ఇటు వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పు పట్టిన మాజీ ఎంపీ సబ్బం హరి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సబ్బం హరి
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే వ్యాఖ్యలపై మాట్లాడిన సబ్బంహరి ఆధారాలు ఉంటె చర్యలు తీసుకోవాలి కానీ ఆరోపణలు చేసుకోవటం మంచిది కాదని చెప్పారు. టీడీపీ నేతలు ఏపీ రాజధాని అమరావతిలోభూములు కొన్నారని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు అని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. అదే సమయంలో వైజాగ్ లో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు సైతం రివర్స్ ఎటాక్ చెయ్యటం మంచిది కాదని ఆయన చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే మాట బూతు మాట అని ఆయన తేల్చి చెప్పారు.

ఒక్కచోట రాజధాని నిర్మాణం చెయ్యలేని సర్కార్ 3 చోట్ల ఎలా చేస్తుందని ప్రశ్న
ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలను చూసి చాలా బాధపడుతున్నానని చెప్పిన సబ్బం హరి అభివృద్ధి పనులను పక్కన పెట్టి మంత్రులు, ప్రభుత్వం అనవసరపు రగడ సృష్టించిందని సబ్బంహరి విమర్శించారు. అమరావతిలో రాజధాని కట్టలేని ప్రభుత్వం మూడు చోట్ల ఎలా రాజధాని కడుతుందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల భిన్నాభిప్రాయాలు వారి వ్యక్తిగతం అని ఆయా ప్రాంతాల ప్రజల అభీష్టం మేరకు వారు మాట్లాడుతున్నారని సబ్బం హరి చెప్పారు. అందులో తప్పేమీ లేదన్నారు.

అమరావతిని విచ్ఛిన్నం చేయొద్దన్న మాజీ ఎంపీ
జగన్ అవగాహనా రాహిత్యం రాష్ట్రానికి చేటు చేస్తుందని సబ్బంహరి తెలిపారు. ప్రస్తుత తరుణంలో మేధావుల మౌనం చాలా ప్రమాదకరం అన్న ఆయన అధికారంలో ఉన్నవారికి అసలే భయం లేకపోవటం ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని పేర్కొన్నారు . అమరావతిని విచ్ఛిన్నం చేయొద్దని సీఎం జగన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సహనానికి జగన్ పరీక్ష పెట్టొద్దన్నారు.

రాజధాని నివేదికలపై ప్రజల్లో విశ్వసనీయత లేదన్న సబ్బం హరి
అనవసర రాద్దంతాలకు జగన్ , వైసీపీ మంత్రులు ఆజ్యం పోస్తున్నారని చెప్పిన సబ్బం హరి కానీ మూడు రాజధానులు అవసరం లేదన్న తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏపీకి ప్రణాళికాబద్ధమైన నగరం కావాలని గట్టిగా చెప్పారు సబ్బం హరి . జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని, రాజధాని నివేదికలపై కూడా ప్రజల్లో విశ్వసనీయత లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications