మీమాంసకు తెర... వైవీ సుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యమేంటి.. జగన్ మనసులో ఏముంది..?
టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం ముగియడంతో ఆయన రాజకీయ భవితవ్యంపై చర్చ జరుగుతోంది. టీటీడీ పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని ప్రభుత్వం నియమించడంతో టీటీడీ ఛైర్మన్గా వైవీని కొనసాగిస్తారా లేదా అన్న మీమాంసకు తెరపడినట్లయింది. సీఎం జగన్ మరోసారి అవకాశమిస్తే ఛైర్మన్గా కొనసాగుతానని వైవీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పినప్పటికీ... ఆయన మనసులో మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయమే ఉందన్న ప్రచారం ఉంది. యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకునే వైవీ సుబ్బారెడ్డి... టీటీడీ ఛైర్మన్ రెన్యువల్ను కోరుకోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టీటీడీ ఈవోను ఛైర్మన్గా నియమిస్తూ పాలకమ మండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమించినట్లు తెలుస్తోంది.దీంతో భవిష్యత్తులో వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఏ పదవిని కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

పదవీ కాలం పొడగింపు లేనట్లే..?
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమించగా.. చైర్మన్గా ఈఓ జవహర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఈఓ ధర్మారెడ్డి కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 21న టీటీడీ పాలకమండలి పదవీకాలం ముగియడంతో... ప్రభుత్వం ఈఓను చైర్మన్గా స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. పాలకమండలి తరహాలోనే అథారిటీకి అన్ని అధికారాలు ఉంటాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధర్మకర్తల మండలి నిర్వహించే విధులన్నీ అథారిటీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనా... అథారిటీ స్థానంలో మళ్లీ పాలకమండలిని నియమిస్తారా అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. మొత్తం మీద అథారిటీ నియామకంతో టీటీడీ ఛైర్మన్గా వైవీ పదవీ కాలం పొడగింపు ఉండదన్న సంకేతాలు పంపించినట్లయింది.

రాజ్యసభకు పంపిస్తారా...
2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి కష్టంగానే వదులుకున్నారు. సీఎం జగన్ మాట మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్సభ సీటును వైవీ త్యాగం చేయక తప్పలేదు. ఆ తర్వాత సీఎం జగన్ ఆయన్ను టీటీడీ ఛైర్మన్గా నియమించడంతో ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆ పదవీ కాలం ముగియడంతో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జరుగుతోంది. నిజానికి వైవీ సుబ్బారెడ్డి కోరుకుని ఉంటే టీటీడీ ఛైర్మన్ పదవి ఆయనకు రెన్యువల్ అవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఆ పదవిలో కొనసాగడం కంటే క్రియాశీలక రాజకీయాల్లో ఉండటానికే వైవీ సుబ్బారెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవిని వైవీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవి సాధ్యమేనా...?
ఇప్పట్లో రాజ్యసభ ఎన్నికలైతే లేవు. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ పదవి ఆశిస్తే కొంత కాలం ఆయన ఖాళీగా ఉండక తప్పదు. కాబట్టి రాజ్యసభ కంటే మంత్రి పదవి వైపే ఆయన మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం ఉంది. మరికొద్ది నెలల్లో సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో తనను కేబినెట్లోకి తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒంగోలు నుంచి ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో ఉండటంతో వైవీకి మంత్రి పదవి సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. మంత్రి బాలినేని జగన్కు అత్యంత సన్నిహితుడు,బంధువు కావడంతో ఆయన్ను తప్పించే అవకాశం ఉండకపోవచ్చు. అదే జరిగితే వైవీకి రాజ్యసభ తప్ప మరో ఆప్షన్ లేదు.

ఢిల్లీలో లాబీయింగ్ కోసం వైవీని దించుతారా?
వైవీ సుబ్బారెడ్డి మనసులో మాట ఎలా ఉన్నా సీఎం జగన్ ఆయన్ను రాజ్యసభకే పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ లాబీయింగ్ అంత బలంగా లేదని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనల సందర్భంగా కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ల విషయంలో జాప్యం... చివరి నిమిషం వరకూ వేచి చూడాల్సిన పరిస్థితిపై జగన్ ఒకింత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ బాధ్యతలను విజయసాయి రెడ్డి సమర్థవంతంగా చక్కబెట్టగా... ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా బిజీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలు ఎంపీ బాలశౌరి చూస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పని జరగట్లేదని జగన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి... ఢిల్లీలో లాబీయింగ్ బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వొచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications