గంటా..ఏమైందబ్బా! టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు..అందుబాటులో లేని మంత్రి
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ కు బదులుగా విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెస్తున్న ఒత్తిడిని భరించలేక.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారు జాము నుంచి ఆయన అధికారిక ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ లో వస్తోందంటూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసినప్పటికీ.. గంటా అందుబాటులోకి రాలేదని అంటున్నారు. దీనితో- ఆయన పార్టీని వీడతారనే అనుమానాలను బలం చేకూరుతోంది.
తనయుడికి బదులు తండ్రి! వైఎస్ఆర్ సీపీ పర్చూరు అభ్యర్థిత్వంలో అనూహ్య మార్పు
తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాస రావు ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చని ఆయన అప్తమిత్రుడిగా పేరున్న అవంతి శ్రీనివాస్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే.. అవంతి శ్రీనివాస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొద్దిరోజుల తరువాత గంటా మీడియా ముందుకు వచ్చారు. పార్టీ ఫిరాయిస్తానంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా గానీ.. టీడీపీనీ వీడిపోయేది లేదని అన్నారు. అనంతరం- ఆయనకు అభీష్టానికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి.
భీమిలీ.. ఎవరికి? ఒక్కోసారి ఒక్కోపేరు
చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. భీమిలీ నుంచి పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ లీకులు వెలువడ్డాయి. లోకేష్ గానీ, టీడీపీ పార్టీ నాయకత్వం గానీ దీనిపై స్పందించలేదు. కొద్దిరోజులకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని, ఆయనకు భీమిలీ టికెట్ ఇస్తారంటూ లీకులు వచ్చాయి. భీమిలీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలియకుండా ఈ లీకులు రావడం.. ఆయనను మనస్తాపానికి గురి చేసినట్లు చెబుతున్నారు. భీమిలీ టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలని చంద్రబాబు సూచనప్రాయంగా గంటా శ్రీనివాసరావుకు తెలియజేశారని సమాచారం.
లోక్ సభకు పోటీకి గంటా విముఖత
విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ సంకేతాలు రావడంతో గంటా.. అంతర్మథనంలో పడ్డారని చెబుతున్నారు. తాను భీమిలీ నుంచే పోటీ చేస్తానంటూ పదేపదే చెప్పుకోవడం వెనుక ఇంత తతంగం నడిపించదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ.. చంద్రబాబు మెట్టు దిగలేదు. ఇక లాభం లేదనుకున్న గంటా.. పార్టీని వీడటానికి సిద్ధపడినట్లు సమాచారం. ఈ అనుమానాలను బలపరిచేలా గంటా శ్రీనివాసరావు అందుబాటులో లేకుండా పోయారు.
ముందు నుంచే పావులు కదుపుతున్నారా?
గంటా శ్రీనివాస రావుకు ఉత్తరాంధ్రలో కీలక నాయకునిగా గుర్తింపు ఉంది. అలవోకగా పార్టీలను ఫిరాయిస్తారనే అపవాదును కూడా ఆయన మోస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో లోక్ సభ, శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తరువాత.. ఆయన తన ఆప్తమిత్రులు అవంతి శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావులతో కలిసి పీఆర్పీలో చేరారు. పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత వాళ్లందరూ అదే పార్టీలో కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి లభించింది.
రాష్ట్ర విభజన తరువాత.. కాంగ్రెస్ లో కొనసాగితే మనుగడ ఉండదనుకున్న గంటా.. తన సన్నిహితులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పీఆర్పీలో ఉండగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి గెలిచిన గంటా.. టీడీపీలో చేరిన తరువాత భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. పీఆర్పీ తరఫున భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్ టీడీపీలో అనకాపల్లి లోక్ సభకు ఎన్నికయ్యారు. యలమంచిలి నుంచి పోటీ చేసిన పంచకట్ల అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
జగన్ పార్టీనా.. జనసేనా?
టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావు ఉమ్మడిగా జనసేన పార్టీలో చేరిపోయారు. అవంతి శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు మాత్రమే ఇన్నాళ్లూ గంటా వెంట ఉండిపోయారు. తాజాగా.. అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ ఫిరాయించడం గంటా శ్రీనివాస్ క్యాంప్ ఖాళీ అయింది. భీమిలీలో గంటా గెలిచే పరిస్థితి లేదని సర్వే రూపంలో టీడీపీ ఇదివరకే మీడియాకు లీకులు ఇచ్చింది. ఫలితంగా - గంటా తనకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తన ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్ తరహాలోనే గంటా వైఎస్ఆర్ సీపీలో చేరుతారా? లేక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ఎంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.