ముఖ్యమంత్రా?.. ఉద్యమకారుడా?: కెసిఆర్పై ఏపి మంత్రి గంటా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపి ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఎస్బిహెచ్ ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు.
అంశంపై కోర్టును ఆశ్రయించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితోపాటు బ్యాంకు వ్యవహార శైలిపై అక్కడే తేల్చుకుంటామని మంత్రి గంటా చెప్పారు. తమ శాఖ నిర్వహిస్తున్న ఖాతాను ఫ్రీజ్ చేసిన ఎస్బిహెచ్పై పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు.
ఫాస్ట్ పథకం అమలుపై తెలంగాణ సర్కారుకు కోర్టు చెంప పెట్టులా మారినా వారి వైఖరిలో మార్పు రాకపోవడం దురదృష్టకరమని గంటా అన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా ఉద్యమకారుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ఫిబ్రవరి 2న జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. యోగా క్లాసులకు తాము హాజరు కాలేకపోయామని, ప్రత్యేకంగా యోగా గురువు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.