విజయవాడకు పురంధేశ్వరి: పవన్ కళ్యాణ్ అసహనం
హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తు కటీఫ్ అనంతరం... విజయవాడ సీటు పైన బిజెపి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ల మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. బిజెపి బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపిందని చెబుతూ టిడిపి ఆ పార్టీకి కటీఫ్ చెప్పాలని భావించింది. ఇదిలా ఉండగా.. విజయవాడ లోకసభ స్థానంపై టిడిపికి పవన్ కళ్యాణ్కు మధ్య ఇటీవలి వరకు రగడ కొనసాగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు టిడిపి, బిజెపి మధ్య పొత్తు తెరమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. తన మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ను విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు. ఇందుకోసం బాబు వద్ద రాయబారం నెరపినా కుదరలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిజెపి, టిడిపి పొత్తు బెడిసి కొట్టిన నేపథ్యంలో బిజెపి తరఫున పొట్లూరి పోటీ చేయనున్నారని గురువారం రాత్రి వరకు ప్రచారం సాగింది.

పొట్లూరి కూడా అదే ధీమాతో ఉన్నారు. అనూహ్యంగా విజయవాడ లోకసభ స్థానానికి మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేరు తెర పైకి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ను, పొట్లూరిని అసంతృప్తికి గురి చేసిందంటున్నారు. రాజంపేట లోకసభ టిక్కెట్ను తొలుత పురంధేశ్వరికి కేటాయించారు. ఇప్పుడు పొత్తు కుదరక పోవడంతో ఆమెను విజయవాడకు మార్చారు. రేపు ఆమె నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారని అంటున్నారు.
పొట్లూరి కోసం తొలి నుండి ప్రయత్నాలు చేసిన పవన్ బిజెపి తీరుపై ఒకింత అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మోడీ కోసం బిజెపికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ అసంతృప్తి అంతా ఒట్టిమాటేనని, వారి మధ్య అండర్ స్టాండింగ్ ఉందనేది మరికొందరి వాదనగా ఉంది. పురంధేశ్వరికి విజయవాడ కేటాయించినందున పొట్లూరిని బుజ్జగిస్తారా? ఆయనకు ఏ స్థానం ఇచ్చి పవన్ను కూల్ చేస్తారనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications