చంద్రబాబు, కేసీఆర్తో తలసాని గేమ్! హామీ రాలేదా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోతున్నారా? ఇద్దరితోను ఆయన గేమ్ ఆడుతున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
సాధారణ ఎన్నికలకు ముందే తలసాని అధినేత చంద్రబాబు పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఆయన సనత్ నగర్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయన తెరాసలోకి వెళ్తారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీని పైన ఆయన మౌనం వహిస్తున్నారు.

బోనాల జాతర సందర్భంగా, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నేడో రేపో కారు ఎక్కుతారనే ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఇటు సైకిల్ దిగకుండా.. అటు కారు ఎక్కకుండా తేల్చుకోలేకపోతున్నారని సమాచారం.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెరాస, మజ్లిస్ కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. తాను తెరాసలో చేరి, ఈ కూటమి గెలిస్తే తన వారికే మేయర్ పదవి అప్పగించాలని తలసాని సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదన తీసుకు వచ్చారని వినికిడి.
దీని పైన కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్లనే తలసాని తెరాసలో చేరికను బలపర్చడం లేదని చెబుతున్నారు. కేసీఆర్ నుండి మేయర్ పదవి పైన హామీ వస్తే ఇప్పటికే ఆయన కారు ఎక్కేవారని చెబుతున్నారు. తనకు మంత్రిపదవి లేకపోయినా మేయర్ పదవి మాత్రం ఇవ్వాలని ప్రతిపాదించారని వినికిడి.












Click it and Unblock the Notifications