బాబు ఎఫెక్ట్: రివర్స్ గేర్.. జగన్లో భారీ మార్పు వచ్చిందా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేలు వరుస కడుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ వన్, ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ టూ ద్వారా టిడిపి ఇప్పటికి 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంది. త్వరలో మరో ఒకరిద్దరు చేరే అవకాశముందని అంటున్నారు.
అందులో ప్రధానంగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పేరు వినిపిస్తోంది. మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ఎక్కుతారని అంటున్నారు. రాజ్యసభ ఎన్నికల నాటికి ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
తన పార్టీ నుంచి నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి వదిలి వెళ్లినా జగన్ పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. బుజ్జగింపులు కూడా సీరియస్గా కాకుండా మొక్కుబడిగా ఉంటాయంటారు. పార్టీలో అసంతృప్తితో పాటు జగన్ బుజ్జగింపులో లోపం కారణంగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అంటున్నారు.

అంతేకాదు, జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల కంటే దేవుడిని, ప్రజలనే నమ్ముకుంటారనే ఓ వెటకారపు కామెంట్ కూడా ఉంది. అందుకే నేతలు వెళ్లినప్పుడు పట్టించుకోరని అంటారు. అయితే, వరుసగా ఎమ్మెల్యేలు క్యూ కడుతున్న నేపథ్యంలో జగన్లో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఇటీవల గొట్టిపాటి రవికుమార్, మేకా ప్రతాప్ అప్పారావు వంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే పుకార్లు రాగానే.. వారిని పిలిపించుకొని బుజ్జగించారు. చంద్రబాబు వద్దకు వెళ్తే పులిగోరలో కరివేపాకులే అవుతారని చెప్పారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు వెళ్లిన, సీనియర్లకు మాత్రమే టిడిపిలో ప్రాధాన్యం ఉంటుందని, ఇక ముందు వెళ్లే వారికి ప్రాధాన్యత ఇవ్వరని చెప్పారని తెలుస్తోంది.
అంతేకాదు, అంతకుముందు పులివెందులలో ఓ ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించారు. ఓ విధంగా కాళ్ల బేరానికి వచ్చినట్లుగా భావించవచ్చునని అంటున్నారు. వలసపోవాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు.
సొంత జిల్లాలోనే పరువును కాపాడాలని సహచర ఎమ్మెల్యేలను జగన్ బతిమాలారట. ఇతరులను కాపాడుకునేందుకు గతంలో కంటే భిన్నంగా రాయబారాలు నెరపుతున్నారని తెలుస్తోంది. అయితే, జగన్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలని అంటున్నారు. ఇప్పటి వరకు ఫలిచిన దాఖలాలు లేవంటున్నారు.












Click it and Unblock the Notifications