విజయసాయిరెడ్డి తలొగ్గలేదనే.. నాపై కేసులు బనాయించారు : జగన్
హైదరాబాద్ : వైసీపీ శ్రేణులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అధినేత జగన్, పార్టీ రాజ్యసభ అభ్యర్థిని ఖరారు చేశారు. వైసీపీ తరుపున విజయసాయి రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జగన్ ప్రతిపాదనకు పార్టీ నేతలంతా ఏకగ్రీవ మద్దతు తెలిపారు. సమావేశంలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ మంతనాలు జరిపారు.
విజయసాయిరెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. తనపై అక్రమ కేసులు బనాయించిన సమయంలో విజయసాయిరెడ్డి తనకు అండగా నిలబడ్డారన్నారు. ఆ సమయంలో తనను దోషిగా నిలబెట్టేందుకు విజయసాయిరెడ్డిని తనకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సిందిగా ఆయన్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని, కానీ ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా.. విజయసాయిరెడ్డి సత్యం వైపే నిలబడ్డారని, నైతికతను నమ్ముకుని తనకు మద్దతుగా ఉన్నారని ప్రశంసించారు.

తమది మాట మీద నిలబడే పార్టీ అని, వైసీపీ ఒక్క మాట కోసం పుట్టిన పార్టీ అన్నారు జగన్. విజయసాయిరెడ్డి ప్రలోభాలకు తలొగ్గకపోవడంతోనే తనను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఆది నుంచి సాయిరెడ్డి పార్టీతో పాటే ఉన్నారని, ఆయన విశ్వసనీయ సేవలను గర్తించే, తగిన స్థానం కల్పించాలన్న యోచనలో భాగంగా సాయిరెడ్డి పేరును రాజ్యసభకు నామినేట్ చేస్తున్నామని చెప్పారు.
ఇక పార్టీ ఫిరాయింపుల గురించి కూడా ప్రస్తావించిన జగన్, చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇదో పరాకాష్ట అన్న తరహాలో కామెంట్ చేశారు. దేన్నైనా డబ్బుతో కొనగలిగే చంద్రబాబు మానవ సంబంధాలను కూడా డబ్బుతో వెల కడుతున్నారని మండిపడ్డారు. టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటనేది త్వరలోనే వాళ్లకు తెలిసి వస్తుందని, ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను చంద్రబాబు నట్టేట ముంచడం ఖాయమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications