జగన్ అడ్వైజరీ కమిటీగా జెఏసి: తోట, కోడెల శాపనార్థం
హైదరాబాద్: సమైక్యాంధ్ర జిల్లా జెఏసి జగన్ అడ్వయిజరీ కమిటీగా మారిందని మంత్రి తోట నర్సింహం సోమవారం మండిపడ్డారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. అన్ని పార్టీలు సమైక్యాంధ్ర ఉద్యమంలో తెల్ల జెండాలతో పాల్గొంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం తమ పార్టీ జెండాలతో ప్రచారం చేస్తున్నా జెఏసి నేతలు పట్టించుకోవడం లేదన్నారు. అన్ని పార్టీలు విభజన విషయంలో కాంగ్రెసునే దోషిగా చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సోనియాకు క్యాన్స్, షిండేకు ఊపిరితిత్తుల వ్యాధి: కోడెల
తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఎవరైనా సర్వనాశనం కాక తప్పదని తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం చేయడంతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్యాన్సర్, కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఊపిరితిత్తుల వ్యాధి, ఎకె ఆంటోనికి ఆపరేషన్, గులాం నబీ ఆజాద్కు మెడ నొప్పులు వచ్చి మంచాన ఉన్నారని విమర్శించారు.

మరోవైపు సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సమైక్యవాదులు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలను ముట్టడించారు. కర్నూలులో మంత్రి టిజి వెంకటేష్ ఇంటిని సమైక్య ఐకాస ముట్టడించింది. టిజికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని టిజి వర్గీయులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
కడపలో మంత్రి సి రామచంద్రయ్య ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంటి గోడకు ఈ నెల 18వ తేదీలోగా రాజీనామా చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికల బోర్డు వెలిసింది.
ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా పడింది. సోమవారం ఉదయం ఈ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరుగగా తదుపరి విచారణను కోర్టు మంగళవారంకు వాయిదా వేసింది. కాగా కోర్టు తీర్పు ఎలా ఉన్నా సమ్మె కొనసాగిస్తామని ఎపిఎన్జీవోలు తేల్చి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గత 45 రోజులుగా ఎపిపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె రాజ్యాంగవిరుద్ధమని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ హైకోర్టు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications