అరుదైన దృశ్యం!: తెలంగాణలో జగన్-చిరంజీవిల ఆప్యాయత, పలకరింపు
హైదరాబాద్: మై హోమ్స్ అధినేత, స్వచ్ఛభారత్ అంబాసిడర్ జూపల్లి రామేశ్వర్ రావు, శ్రీకుమారి దంపతుల షష్టిపూర్తి మహోత్సవానికి బుధవారం నాడు పలువురు రాజకీయ, సినీరంగ, ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, చిరంజీవి, రామోజీ రావు తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, జగన్లు ఒకరినొకరు చిరు నవ్వులతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాసేపు ఇద్దరూ నిలబడి మాట్లాడుతున్నారు. పక్క పక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుతున్నారు.
భాగ్యనగరం శంషాబాదులోని త్రిరంగానగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అయిన చిరంజీవి సతీసమేతంగా వచ్చారు. రామేశ్వర రావుపై రచించిన పుస్తకాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్నజీయర్ స్వామి ఆవిష్కరించి తొలి కాపీని చిరంజీవికి అందజేశారు.
అదే సమయంలో అక్కడికి జగన్ వచ్చారు. దీంతో రామేశ్వర రావు కుటుంబ సభ్యులు జగన్ను చిన్నజీయర్ స్వామి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామేశ్వర రావు చిరంజీవి, జగన్లను చెరో చేత్తో పట్టుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి, జగన్ పలకరించుకున్నారు. ఈ సన్నివేశం అందర్నీ అలరించేదిగా చెప్పవచ్చు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, వడ్డే నవీన్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బాలగాయని సూర్యగాయత్రి పాడిన హనుమాన్ ఛాలీసా అందర్నీ ఆకట్టుకుంది. శివమణి వివిధ డ్రమ్స్ పైన సృష్టించిన నాదానికి తెలంగాణ సిఎం కెసిఆర్ సహా అందరూ పులకించిపోయారు. అంతే, తన మెడలోని మాలను తీసి శివమణి మెడలో వేసి శభాష్ అన్నారు.