టార్గెట్ చంద్రబాబు: ఆ 8 నియోజకవర్గాల్లో జగన్ భారీ బహిరంగ సభలు

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీని మరింత బలోపేతం చేయడం గాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ చేరిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబునాయుడు సమక్షంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిడిపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జగన్.. పార్టీ నుంచి మరెవరూ ఇతర పార్టీలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.

అంతేగాక, పార్టీ మారిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడిన ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన వాదనకు ప్రజల నుంచి మద్దతు రావడంతో నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.

Jagan Planning Eight Public Meetings in Defectors’ Constituencies

ఈ నేపథ్యంలోనే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తమ పార్టీ టికెట్‌పై గెలిచిన నేతలు, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో వెళ్లడం సమంజసం కాదనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

చంద్రబాబునాయుడు కోట్ల రూపాయలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగులో చేస్తున్నారని ఇప్పటికే పలు సందర్భాల్లో వైయస్ జగన్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ప్రజలు, కార్యకర్తల్లోకి ఈ సభల ద్వారా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే తమ పార్టీ నుంచి మంచి అభ్యర్థిని నిలబెడతామని, అతడ్ని గెలిపించాలని
ప్రజలను కోరనున్నారు.

ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే తేల్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బద్వేల్ ఎమ్మెల్యే టి జయరాములు, ఎర్రగొండపాలెం మ్మెల్యే పి డేవిడ్ రాజు, కొడుమూరు ఎమ్మెల్యే ఎం మణిగాంధీ, పాతపట్నం ఎమ్మెల్యే కెవి రమణమూర్తిలు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

కాగా, విశ్వసనీయత లేని నేతలే విశ్వసనీయతలేని నాయకుడి వద్దకు వెళ్లారని వైయస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నీటి ప్రాజుక్టుల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని వైయస్ జగన్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు జగన్ ఈ 8 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

డబ్బుల కోసం పార్టీ మారిన వారికి తగిన బుద్ధి చెప్పడం కోసమే జగన్ ప్రజల్లోకి వస్తున్నారని పేర్కొంటున్నాయి. కాగా, జగన్ పర్యటనలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తుందని చెబుతున్నాయి. అలాగే చంద్రబాబు, ఆయన ప్రభుత్వాన్ని, పార్టీ మారిన నేతలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించనున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+