జీవో నంబర్ 1పై ఏపీ సర్కార్ క్లారిటీ- కేవలం వాటిపైనే నిషేధం-వీటికి ఓకే..!
ఏపీలో కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల తర్వాత వైసీపీప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అన్ని రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలు నిషేధించింది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విపక్షాల్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ చీకటి జీవోను తెచ్చిందంటూ విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ మంత్రులు దీనిపై క్లారిటీ ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం తరఫున శాంతి భద్రతల డీజీ రవిశంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు.
జీవో నెం.1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ ఇవాళ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని ఆయన తెలిపారు. నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రజల భద్రత చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని ఆయన తెలిపారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం ఇస్తామన్నారు. ఈ జీవోపై వాస్తవాలను మీడియా ప్రజలకు వెల్లడించాలని సూచించారు.

రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని పోలీసులు ఇవాళ వెల్లడించారు. ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు. అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. దీంతో విపక్షాల విమర్శలకు ఇక బ్రేక్ పడవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications