విజయవాడ ప్రజలకు జగన్ న్యూ ఇయర్ కానుక..! అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ పై పరుగులే..!!
అమరావతి/హైదరాబాద్ : విజయవాడ ప్రజానికానికి ఏపి సీయం జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా గుర్తుంచుకోబోయే నూతన సంవత్సర కానుక ఇవ్వబోతున్నట్టు చర్చ జరగుతోంది. అంతే కాకుండా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నాన్ని కూడా వైసీపి ప్రభుత్వం నెరవేర్చబోతోంది. అందుకు వైసిపి ప్రభుత్వం వేస్తున్న అడుగులను చూసి బెజవాడ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ ప్రజలందరి ఏకైక కోరికగా మిగిలిపోయింది దుర్గగుడి ఫ్లై ఓవర్. అది పూర్తయితే దాని మీద వెళ్లాలని ఆనందంతో వారు ఈ కోరిక కోరలేదు. ఆ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, అవి తగ్గిపోతాయని విజయవాడ వారి కోరిక. అయితే, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రావడంతో చంద్రబాబు మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి కేంద్రం ఈ ప్రాజెక్టు ఆలస్యం చేసిందనే ఆరోపణలున్నాయి. ఇంకా దానికి రావల్సిన 20 కోట్లు కేంద్రం విడుదల చేయకపోవడమే కారణం. అయితే, తాజా ఏపీ మంత్రులు ఇద్దరు దీనిపై స్పందించారు.

విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం అయిన దుర్గగుడి ఫ్లైఓవర్ పనులను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 31 నాటికి పూర్తి చేసి తీరుతామని, కొత్త ఏడాది గిఫ్టుగా ఆ బ్రిడ్జిని ఓపెన్ చేస్తామని ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు వారిద్దరు ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. వాస్తవానికి ఏపీలో ఏ నగరానికి లేని సమస్య విజయవాడకు ఉంది. నది, కొండలు అడ్డుగా ఉండటం వల్ల జాతీయ రహదారిని బైపాస్ గా ఊరి చివరన నిర్మించలేకపోతున్నారు. జాతీయ రహదారి సిటీ మధ్య నుంచి పోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
అది కొంత మేర తగ్గించే ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు హయాంలో ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. అప్పట్లో కేంద్రం రాష్ట్రం పొత్తులో ఉండటంతో కేంద్ర నిధులతో ఈ ప్రాజెక్టు కట్టేలా చంద్రబాబు మోడీని ఒప్పించారు. ఎపుడైతే ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయో అప్పటి నుంచి కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చింది. అందుకే పనులు పూర్తి కాలేదు. ఇపుడు మోడీ- జగన్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఫ్లై ఓవర్ పనులు చకాచకా పూర్తి చేసి నూతన సంవత్సరం కానుకగా ప్రజలకు అందివ్వాలని వైసీపి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.












Click it and Unblock the Notifications