పవన్కు జగన్ "మెగా" చెక్ :బాబు బిత్తరపోయేలా.. పెద్దల సభకు ఆ నలుగురూ..!
Recommended Video
అమరావతి: ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధానమంత్రి మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ కేంద్ర కేబినెట్లో చేరుతోందన్న వార్త ఢిల్లీలో షికారు చేస్తుండటంతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ను పెంచుతున్నాయి. ఇక శుక్రవారం జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం, అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనుండటంతో రాజకీయాలు రంజుగా తయారవుతున్నాయి.

రాజ్యసభలో మద్దతు కోసం బీజేపీ గాలం
ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 100 నిమిషాల భేటీ తర్వాత అక్కడ ఏం చర్చించుకున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయాలని జగన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో రాజకీయాలకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడీ సర్కార్ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం.... తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ దెబ్బకు సింగిల్ డిజిట్కే పరిమితం అయిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి వైసీపీ మద్దతు కోరుతోంది. మొన్న ప్రధానితో భేటీ సందర్భంగా ఈ అంశం కూడా జగన్తో బీజేపీ చర్చించినట్లు సమాచారం. తాజాగా అమిత్ షాను కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏప్రిల్ 9న ముగియనున్న నలుగురు సభ్యుల పదవీకాలం
బీజేపీ ఏదైనా బిల్లులు పాస్ చేయించాలంటే లోక్సభలో సులభంగా పాస్ అవుతున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం తక్కువ సంఖ్యాబలం ఉండటంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు మోడీ-షా-నడ్డా టీం మాస్టర్ ప్లాన్తో ముందుకు అడుగులు వేస్తోంది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా లాభం లేదని భావిస్తున్న బీజేపీ రాజ్యసభలో గట్టెక్కాలంటే వైసీపీని మచ్చిక చేసుకుంటే బాగుంటుందన్న భావనలో బీజేపీ ఉంది. ఇక రాజ్యసభ సీట్ల విషయానికొస్తే ఏపీలో ఏప్రిల్ 9వ తేదీతో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు పదవీకాలం ముగుస్తుంది. టీఆర్ఎస్కు చెందిన కే. కేశవరావు, కాంగ్రెస్కు చెందిన ఎంఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, తోటసీతారామలక్ష్మీలు పదవీ విరమణ పొందనున్నారు.

వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీరేనా..!
ఇక నాలుగు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా రాజ్యసభకు వైసీపీ నుంచి పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మాజీ ఛైర్మెన్ మాజీ వ్యవస్థాపకులైన అయోధ్య రామిరెడ్డి, ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న బీద మస్తాన్ రావు, సినీనటులు మాజీ కేంద్రమంత్రి చిరంజీవి , మరో సినీటుడు మోహన్ బాబు లేదా న్యాయరంగానికి చెందిన మరో ప్రముఖ వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓ నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి ఈ న్యాయరంగానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపాల్సిందిగా సీఎం జగన్కు సూచించారని సమాచారం. ఇటీవలే వీరిద్దరూ కలిసి సీఎం జగన్ను కూడా కలిశారు.

చంద్రబాబు సామాజిక వర్గానికి చెక్ పెట్టే యోచనలో జగన్..?
న్యాయరంగానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపాలని జగన్ మనసులో కూడా ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తాను మాత్రం ఆసక్తి చూపడం లేదని సమాచారం. న్యాయరంగానికి చెందిన ప్రముఖ వ్యక్తిని పెద్దల సభకు పంపడం ద్వారా చంద్రబాబు సామాజిక వర్గంకు చెక్ పెట్టాలనే యోచనలో సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అయితే న్యాయరంగానికి చెందిన ఈ ప్రముఖ వ్యక్తి మాత్రం రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి చూపడం లేదని సమాచారం.

పలువురు ఆశావాహుల ప్రయత్నం
ఇదిలా ఉంటే రాజ్యసభ సీటు కోసం పలువురు ఆశావాహులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మండలి రద్దు కావడంతో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రి పదవి కోల్పోనున్నారు. దీంతో ఇద్దరు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. అదీ కాక ఇద్దరూ బీసీ సామాజికవర్గంకు చెందినవారే కావడం విశేషం.కానీ, వారికి ప్రాంతీయ మండళ్ల ఛైర్మన్ల పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు సైతం రాజ్యసభ ఆశిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు అదే సమయంలో కాపు సామాజికవర్గంను మరింత దగ్గర చేసుకునేందుకు చిరంజీవిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో న్యాయ ప్రముఖుడిని ఒప్పించేందుకు వైసీపీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ పరిస్థితేంటి..?
ఒకవేళ రాజ్యసభకు వెళ్లేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటా అనేది మరో చర్చకు దారితీస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే జనసేన పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలవడం, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో తమకు ఎలాంటి లాభం లేదని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ మోడీ - షా వేసిన పాచిక పారితే ఏపీలో జనసేనాని పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. కలిసి వెళతారా లేక మరోదారి చూసుకుంటారా అనేది కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లలేరనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో ఏపీ రాజకీయాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications