అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్: హరీష్, అభ్యర్థి దొరకకనే..
హైదరాబాద్: అద్వానీ లాంటీ సీనియర్ నేతలను సాగనంపి జగ్గారెడ్డి వంటి వారిని బీజేపీలో చేర్చుకున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం ధ్వజమెత్తారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఇప్పటికే మెదక్లో ప్రజలు తమకు పట్టం కట్టారని, అది కొనసాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వవద్దన్న జగ్గారెడ్డిని కాంగ్రెసు పార్టీ నుంచి తీసుకొని బీజేపీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చారని, తెలంగాణ ప్రజలు ఇప్పటికే సంగారెడ్డిలో జగ్గారెడ్డిని ఓడించారని గుర్తు చేశారు. బీజేపీ తీరు విచిత్రంగా మారిందని, పార్టీ కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర చేసిన అద్వానీని జాతీయ స్థాయిలో పక్కకు పెట్టారని, క్షేత్రస్థాయిలో బీజేపీ కోసం పని చేసిన వారిని కాదని జగ్గారెడ్డి వంటి వారిని చేర్చుకున్నారన్నారు. అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్ అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ వ్యతిరేకి అయిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చిన బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అభ్యర్థి దొరకకనే జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందన్నారు. జగ్గారెడ్డి విభజన సందర్భంగా మెదక్ జిల్లాను కర్నాటక రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేశారని, మెదక్ జిల్లా ప్రజలు ఈ విషయాన్ని మరిచిపోలేదన్నారు.
వీరసమైక్యవాది జగ్గారెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మందా జగన్నాథం టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు. గురువారం తెలంగాణ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి అమరుల త్యాగాలను బీజేపీ, టీడీపీలు కించపరిచాయన్నారు.