అది బలవంతపు పెళ్లి, ఇది సర్గుబాటు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యోగులు చేసినటువంటి పోరాటం దేశంలో ఎక్కడా జరగలేదని కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ప్రశంసించారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు రాజీలేని పోరాటం చేశారని ఆయన అభినందించారు. టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీవో 2014 నూతన డైరీ ఆవిష్కరణ సభ గురువారం రాత్రి కోఠిలోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగింది.
తెలంగాణ సాధించుకోవాలనే కోరిక ఎప్పుడూ కొనసాగుతూ వచ్చిందని జైపాల్ రెడ్డి డైరీ ఆవిష్కరణ సభలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. 1956లో బలవంతపు పెళ్లి జరిగిందని ఇది కేవలం సర్దుబాటు పెళ్లి మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నాయకులకు యుపిఎ మేనిఫెస్టోపై అవగాహన లేదా అని ఆయన ప్రశ్నించారు.

దేశంలో ఏ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగుల ఉద్యమం జరగలేదని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిందని చెబుతూ ఆనాడూ లేని అభ్యంతరం ఈనాడు ఎందుకని ఆయన ప్రశ్నించారు. వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పార్లమెంటు సభ్యుడు వివేక్ విమర్సించారు. పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్టికల్ 3 ప్రకారం చర్చలు జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రికిరణ్ కుమార్ రెడ్డి చర్చను వ్యతిరేకిస్తూ కాలయాపన చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications