అద్వానీని మమ్మీ.. సుష్మను డమ్మీ చేశారు: మోడీపై జైపాల్, కెసిఆర్పైనా
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో కురువృద్ధుడు ఎల్కే అద్వానీని మమ్మీ... సీనియర్ నేత, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను డమ్మీ చేశారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో మోడీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. అసాధ్య హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని అన్నారు.
అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి అంటూ ఎద్దేవా చేశారు. కెసిర్ మొదటి నుంచి బిజెపితో జత కట్టాలనుకున్నారని జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపికి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతోందని అన్నారు. పాకిస్థాన్ విషయంలో మోడీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్ రెడ్డి విమర్శించారు.
‘తెలంగాణ చరిత్రలో కెసిఆర్ సొంత డబ్బా': ఉత్తమ్, షబ్బీర్
ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లోని తెలంగాణ చరిత్రలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సొంత డబ్బా ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ మీడియాతో మాట్లాడుతూ.. 10వ తరగతి సాంఘీక శాస్త్రంలోని పాఠ్యాంశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ వల్లే సాధ్యమైందని రాశారని చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్, ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న అమరవీరుల పేర్లు ప్రస్తావించలేదని ఆరోపించారు.
భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్యపుస్తకాలున్నాయని విమర్శించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చట్టసభల్లో అంగీకరించారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గుర్తు చేశారు.