వైసీపీ ఓటు వేయొద్దని చెప్పారే గానీ- ఎవరికి వేయాలి?- లాజిక్ మిస్ అయిన పవన్ కల్యాణ్
రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటు వేయొద్దంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని ఓడించాలని సూచించారు.
అమరావతి: జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడానికి సన్నద్ధమౌతోంది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఈ సభను ఏర్పాటు చేయనుంది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ కావడం వల్ల భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో సభను నిర్వహిస్తామని జనసేన తెలిపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ..
మరోవంక- రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం 14 నియోజకవర్గాలకు ఈ నెలలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేల కోటాలో..
ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఈ కోటాలో విజయనగరం- వీవీ సూర్యనారాయణ రాజు, బాపట్ల- పోతుల సునీత, విశాఖపట్నం- కోలా గురువులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- బొమ్మి ఇజ్రాయెల్, ఏలూరు- జయమంగళ వెంకటరమణ, గుంటూరు-చంద్రగిరి ఏసురత్నం, పల్నాడు- మర్రి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తాయి..

ఇదీ షెడ్యూల్..
ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 10 మంది శాసనమండలి సభ్యుల పదవీకాలం మార్చి 29వ తేదీన ముగుస్తుంది. వీరిలో ఏపీ-7 తెలంగాణ-3 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 6వ తేదీన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 13. 14వ తేదీన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. 16వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 23వ తేదీన పోలింగ్ ఉంటుంది.

జనసేన దూరం..
ఈ శాసనమండలి ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉంటోంది. ఇందులో పోటీ చేయట్లేదు. ఫలితంగా- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి ఓటు వేయాలనే సందేహాలు ఏర్పడ్డాయి. ఈ సందేహాలను చివరికి జనసేన పార్టీ కూడా స్పష్టం చేయలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకైనా ఓటు వేయాలని పవన్ కల్యాణ్ సూచించలేదు.

వైసీపీకి వ్యతిేకంగా ఓటు..
కొద్దిసేపటి కిందటే జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే జనసైనికులు, వీర మహిళలకు పవన్ కల్యాణ్ కీలక సూచన చేశారు. వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన చెప్పారు. వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, రాష్ట్రాభివృద్ధి కోసం అధికార పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

ఎవరికి ఓటు వేయాలి..?
వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చాడే గానీ- ఆ ఓటును ఎవరికి వేయాలనేది సూచించలేదు. మిత్రపక్షం బీజేపీ పేరును కూడా ఆయన ఈ ప్రకటనలో ప్రస్తావించలేదు. అలాగని- జనసైనికులు, వీర మహిళలందరూ ఈ ఎన్నికలను బహిష్కరించాలని, ఓటింగ్ కు దూరంగా ఉండాలని అయినా చెప్పలేదు పవన్ కల్యాణ్. ఇది కాస్తా జనసేన పార్టీ క్యాడర్ లో తీవ్ర గందరగోళానికి దారి తీసినట్టయింది.












Click it and Unblock the Notifications