పొత్తుల ఒత్తిడిలో పవన్ - వైసీపీ మైండ్ గేమ్ : జగన్ కు కావాల్సింది అదే- చంద్రబాబుదే నిర్ణయం..!!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో టీడీపీతో పొత్తు విషయంలో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ 2024 ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేబినెట్ కూర్పు..పార్టీలో మార్పులు.. గడపగడపకు వైసీపీ అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించింది. ఇదే సమయంలో టీడీపీ సైతం వ్యూహాలను పదును పెడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల పైనా కొంత కాలంగా పార్టీల మధ్య విమర్శలు - సంకేతాలు మొదలయ్యాయి.

2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు
ప్రధానంగా వైసీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పొలిటికల్ మైండ్ గేమ్ ప్రారంభించింది. జనసేన అధినేత పైన పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. జనసేన - బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలోనే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేక ఓట్లు చీలనివ్వమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలగా మలచుకొనే ప్రయత్నం చేసింది. వైసీపీ నేతలు జనసైనికులు ఇక చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్దంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేడర్ పైన ప్రభావం చూపాయి.
వీటికి స్వయంగా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. వైసీపీ నేతలకు జనసేన కేడర్ పైన ప్రేమ ఎందుకని.. జనసేన నేతలు సైతం వ్యూహాల గురించి తనకు వదిలేయాలని సూచించారు. అదే సమయంలో తాము ఎవరి పల్లకీలు మోయమని పదే పదే చెప్పుకొస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా ఒత్తిడి
దీని ద్వారా టీడీపీతో కలిసే అవకాశం లేని విధంగా జనసేనాని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. వైసీపీ మొదలు పెట్టిన మైండ్ గేమ్.. జగన్ కోరుకొనేది అనే అనేది వారి అభిప్రాయం. ప్రభుత్వం పైన సహజంగానే ఎంతో కొంత క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది.
ప్రతిపక్షాల్లో చీలక వస్తేనే..ఓటు చీల అధికార పక్షానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ సైతం ఇదే ఫార్ములా అనుసరిస్తోంది. అందులో ఇప్పటి వరకు అయితే, వైసీపీ మైండ్ గేమ్ లో పవన్ చిక్కుకున్నట్లుగా స్ఫష్టం అవుతోంది. ఒక రకంగా పవన్ ఒత్తిడిలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు బీజేపీతో పొత్తుతో కొనసాగుతున్నా..వారితో మనస్పూర్తిగా కలిసి పని చేయలేకపోతున్నారు.

పవన్ తేల్చుకోలేకపోతున్నారా..
చంద్రబాబు తో పొత్తు ఖరారు చేస్తే... వారి పల్లకి మోసేందుకు జనసైనికులను పవన్ సిద్దం చేస్తున్నారనే విమర్శలతో పవన్ సందిగ్ధతలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ఇదే వ్యూహం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం బీజేపీతోనూ పొత్తు కోరుకుంటున్నారనేది పార్టీ నేతల అభిప్రాయం.
అటు జనసేన..ఇటు బీజేపీతో కలిసి..అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తే..వైసీపీని గద్దె దించగలుగుతామనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అయితే, బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో కలవటం సాధ్యపడదనే అభిప్రాయం వినిపిస్తోంది.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత చంద్రబాబు - పవన్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు..బీజేపీని అందులో మినహాయించటం ద్వారా బీజేపీ - ఏపీలో టీడీపీలో కలవదనే నమ్మకం బీజేపీ అధినాయకత్వం నుంచి స్పష్టత వచ్చిందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు నిర్ణయాలపై ఆసక్తి
దీంతో..చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఒక విధంగా ఇప్పుడు పవన్ వైసీపీ మైండ్ గేమ్ లో చిక్కకుండా.. తమతో కలిసేలా తిప్పుకొనే బాధ్యత చంద్రబాబు పైనే ఉందనేది విశ్లేషకుల అంచనా. అదే సమయంలో వైసీపీ మరింతగా టీడీపీ - పవన్ ను టార్గెట్ చేస్తూ జోరు పెంచే అవకాశం కనిపిస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాలు మారటంతో పాటుగా మరింత ఉత్కంఠతను పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications