Ysrcp Vs Janasena: వైవీ సుబ్బారెడ్డికి పోటీగా నాగబాబు?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రకు మొన్నటివరకు ఎంపీ విజయసాయిరెడ్డి బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి జగన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఉత్తరాంధ్ర బాధ్యతలను చేపట్టడానికి జనసేనాని పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆయనకు పార్టీలో ఏ పదవి లేకపోయినప్పటికీ బాధ్యతలు స్వీకరించడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు.
ప్రస్తుతానికి ఒక్కడే అయిన నాదెండ్ల మనోహర్
ప్రస్తుతానికి జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహన్ చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ఈ పార్టీలో బాధ్యులు లేరు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలే పోరాటం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యత తీసుకోవడానికి నాగబాబు ముందుకు రావడంతోపాటు జూన్ ఒకటోతేదీ నుంచి ఈ మూడు ఉమ్మడి జిల్లాలో పర్యటించబోతున్నారు.
అధికారికంగా నాగబాబు పర్యటన
జనసేన పార్టీ నాగబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించింది. ఈ జిల్లాల్లో పర్యటించిన తర్వాత పార్టీ పరిస్థితి, బలమైన స్థానాలు, ఓటింగ్ తదితర విషయాలను నాగబాబు ఒక నివేదిక రూపంలో పవన్కల్యాణ్కు అందించనున్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఏ పదవి లేకపోయినప్పటికీ తర్వాత ఏదో ఒక పదవి కట్టబెట్టే యోచనలో పవన్కల్యాణ్ ఉన్నారు.
ఉత్తరాంధ్రలో పట్టు నిరూపించుకోవాలి
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని రాజకీయ పార్టీలన్నీ భావిస్తున్నాయి. జనసేన నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పవన్కల్యాణ్ దగ్గర నాగబాబు బాగా ప్రభావితం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరంజీవికికానీ, పవన్కల్యాణ్కుకానీ అభిమానులు ఎక్కువ. ఈ అభిమానాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల రూపంలో మలచుకోవాలనే పట్టుదలను జనసేన నాయకులతోపాటు నాగబాబు కూడా ప్రదర్శిస్తున్నారు.