అంతిమ యుద్ధానికి శంఖారావం పూరిస్తోన్న చైతన్య రథం
ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని, ఆరుశాతం ఓట్లను సాధించిన జనసేన ఈసారి కంగ్మేకర్గా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో ఇరు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది.
ఎన్టీఆర్ చైతన్య రథం తరహాలో..
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉన్న పవన్ దీనికోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని తయారు చేయిస్తున్నారు. వాస్తవానికి విజయదశమి నుంచే యాత్ర ప్రారంభించాలనుకున్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసిన తర్వాత యాత్ర చేయాలని నిర్ణయించారు. అతి త్వరలోనే బస్సు యాత్రకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. మొదట పుణెలో వాహనం సిద్ధం చేసినప్పటికీ పవన్ కల్యాణ్ సూచనల మేరకు దాన్ని హైదరాబాద్ కు తరలించారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ కోసం రూపొందించిన చైతన్య రథంలాగే దీన్ని కూడా సిద్ధం చేస్తున్నారు.
360 డిగ్రీల కోణంలో వాహనానికి సెక్యూరిటీ
దేశవ్యాప్తంగా టీటైమ్ ఔట్లెట్స్ తో పేరు తెచ్చుకున్న యువ పారిశ్రామికవేత్త ఉదయ్ ఈ చైతన్యరథాన్ని పర్యవేక్షిస్తున్నారు. జరుగుతున్న పనులను పవన్ కల్యాణ్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సినిమా కథానాయకులకు ఉండే క్యారీవ్యాన్ లా కాకుండా పూర్తిగా రాజకీయాల కోసం ఉపయోగించేలా సిద్ధం చేస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కూర్చొని చర్చించుకునేలా వాహనం లోపల సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేశారు.
360 డిగ్రీల కోణంలో వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేలా సీసీ కెమెరాలున్నాయి. వాహనానికి రెండువైపులా బాడీగార్డులు నిలబడటానికి, జీపీఎస్ ట్రాకింగ్, వాహనం లోపలి నుంచి పవన్ పైకి వచ్చేలా పవర్ లిఫ్ట్ సిస్టం సిద్ధమవుతోంది. ప్రజలతో మాట్లాడే సమయంలో చిన్న డయాస్ లా డిజైన్ చేయడంతోపాటు సౌండ్ సిస్టం, లైటింగ్ ఉన్నాయి.
బాడీకి మిలిటరీకి చెందిన ఆకుపచ్చ రంగు
త్వరలోనే ప్రారంభమయ్యే యాత్రను ఎన్నికలు జరిగేవరకు పొడిగించడంతోపాటు తర్వాత కూడా ప్రచారానికి ఉపయోగించాలన్న ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకు తగ్గట్లుగా అవసరమైన హంగులను ఈ వాహనానికి అమరుస్తున్నారు. బాడీ దృఢంగా ఉండటంతోపాటు మిలిటరీకి చెందిన ఆకుపచ్చ రంగు ఉపయోగిస్తున్నారు. వాహనానికి రెండువైపులా బార్లు, ప్లాట్ఫామ్స్, ఒకవైపు ఆరుగురు, మరోవైపు ఇంకో ఆరుగురు బాడీ గార్డులు నిలబడేలా రూపొందించారు. చైతన్య రథం పనులన్నీ అతి త్వరలోనే పూర్తికాబోతున్నాయి. పవన్ యాత్ర చేయడమే తరువాయి.!