వైసీపీ ట్రాప్ లో పవన్ కల్యాణ్- మారుతున్న అంచనాలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జనసేనాని పవన్ రాజకీయంలో కొత్త మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ - జనసేన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ టార్గెట్ గా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు - తీవ్ర వ్యాఖ్యల మధ్య పవన్ విశాఖ కేంద్రంగా కీలకంగా మారారు. వైసీపీ నేతల్లో కొందరు దూకుడుకు తాను దూకుడుగానే సమాధానం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. టీడీపీ కోరుకుంటుందీ అదే. తాము ఎక్కడా తొందర పడకుండా.. వైసీపీకి ఆ తరహా కౌంటర్లు పవన్ ఇవ్వాలని భావిస్తున్నారు.
పవన్ కు మద్దతుగా నిలుస్తూ.. సీఎం జగన్ లక్ష్యంగా పవన్ రాజకీయాన్ని తమకు అవకాశంగా మలచుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగా.. విశాఖ - ఇప్పటంలో తాజాగా పవన్ పర్యటన సమయంలో చంద్రబాబు జనసేనానికి మద్దతుగా ట్వీట్లు చేసారు. ఇక, ఇదే సమయంలో రాజకీయంగా మరో విశ్లేషణ వినిపిస్తోంది. వైసీపీ ట్రాప్ లో పవన్ చిక్కుకుంటున్నారా అనే ప్రశ్న మొదలైంది. విశాఖ పర్యటన తరువాత పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెప్పు చూపిస్తూ...తీవ్ర పదజాలంతో వైసీపీ నేతలకు హెచ్చరిక చేసారు. ఆ తరువాత వెంటనే చంద్రబాబు స్వయంగా వెళ్లి పవన్ ను కలిసారు. ఇటు సీఎం జగన్ తో పాటుగా మంత్రులు..వైసీపీ నేతలు పవన్ చెప్పు చూపిస్తూ బూతులు మాట్లాడారంటూ కార్నర్ చేసారు.

దీనికి జనసేన నుంచి స్పందన లేదు. ఆ తరువాత పవన్ స్వయంగా వైసీపీ తీరుకు చెప్పు చూపించక ఏం చేయాలంటూ ప్రశ్నించారు. ఇక, ఇప్పటం వ్యవహారంలో అక్కడ ఒక్క ఇల్లు పడగొట్టలేదు. ప్రహరీలు మాత్రమే కూల్చారు. ఇదే విషయాన్ని మంత్రులు ఫొటోలతో ప్రదర్శించారు. కానీ, పవన్ కళ్యాణ్ అక్కడ వ్యవహరించిన తీరు పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కారు టాప్ పైన కూర్చొని ప్రయాణం చేయటం..ఆవేశంగా మాట్లాడటం ఇవన్నీ రాజకీయంగా పవన్ కు మైనస్ అవుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ జనసేన ఏర్పాటు సమయం నుంచి ఎక్కడ సంయమనం కోల్పోలేదు. ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి..అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో విమర్శలకు కారణమయ్యాయి.
వైసీపీ నేతల వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి..చంద్రబాబు రాజకీయంగా ఏ విధంగా వ్యవహరించిదీ రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు పవన్ వైసీపీ నేతల మైండ్ గేమ్ లో భాగంగా రెచ్చగొట్టే ట్రాప్ లో పడి..విమర్శలకు కారణమవుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ కాబోయే సీఎం అంటూ జనసైనికులు ప్రచారం చేస్తున్న సమయంలో..ఇప్పుడు తాజా పరిణామాలు చర్చకు కారణమవుతున్నాయి. వైసీపీకి ఇదే తరహా సమాధానం సరైనదని జనసేనాని భావిస్తున్న సమయంలో..దీనికి జనం నుంచి మద్దతు ఉంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications