సుపారీ గ్యాంగులు రాళ్ల దాడి యత్నం - రాపాకపై పవన్ పంచ్ డైలాగులు..!!
జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తనపై రాజోలులో సుపారీ గ్యాంగ్తో రాళ్లదాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మేల్కోపోతే ఇబ్బంది పడతామన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీలు, గుండాలను వెనకేసుకొస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లాఅండ్ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని..రూల్ ఆఫ్ లా ఎక్కడా అమలు కావడంలేదని చెప్పుకొచ్చారు. రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్ డైలాగులతో పవన్ తీవ్ర విమర్శలు చేశారు.
విముక్తి చేయాలని పిలుపు: పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాను ప్రజల ముందు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటే తన పైన దాడికి ప్రయత్నాలు జరిగాయని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన నుంచి అన్నపూర్ణ వంటి ఉమ్మడి గోదావరి జిల్లాలను విముక్తి చేయాలని పిలుపునిచ్చారు.

ఉమ్మడి గోదావరిలోని 34 నియోజకవర్గాలపై జనసేన దృష్టి సారించిందని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పి.గన్నవరంలో జనసేన జెండా ఎగురవేయాలని నిర్దేశించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సామాన్యులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని గుర్తు చేసారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు తాను చెప్పిన మాటలను పవన్ ప్రస్తావించారు.
రాపాకపై సెటైర్లు: 2019లో జనసేన పార్టీని రాజోలు నియోజకవర్గంలో గెలిపించి మార్పు కోసం చిరుదీపం వెలిగించారని చెప్పుకొచ్చారు. అది భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అఖండ జ్యోతిగా మారి ప్రజలందరికీ వెలుగునిస్తుందంటూ... జనసేన నుంచి గెలిచి వైసీపీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పేరు ప్రస్తావించకుండానే పంచ్ డైలాగులతో పవన్ విమర్శలు చేశారు.
జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లిపోయారన్నారు. రిసార్ట్స్, హోటళ్లలో పెట్టి బుజ్జగించడానికి ఆయనేమీ చిన్నపిల్లాడు కాదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయినా పార్టీని వీడకుండా ప్రజలంతా అండగా ఉన్నారుని.. ఆ ప్రేరణతోనే ముందుకు వెళుతున్నామని పవన్ పేర్కొన్నారు.
యుద్దం మొదలవ్వాలి: గోదావరి జిల్లాల నుంచే వైసీపీపై యుద్ధం మొదలవ్వాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 34 స్థానాలున్న గోదావరి జిల్లాల్లో జనసేనకు పట్టుందని చెప్పారు. వైసీపీ పాలన నుంచి ఈ జిల్లాల్లో విముక్తి కలిగితే రాష్ట్రం బాగు పడుతుందన్నారు. పాలించే నాయకుడు నిజాయితీపరుడైతే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
కష్టాలను తట్టుకుని నాయకులు నిలబడితే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు అండగా నిలబడతారని వారాహి యాత్ర నిరూపిస్తోందని పవన్ వివరించారు. జనసేన పార్టీలో వర్గాలు ఉండడం తప్పులేదని.. అందరూ జనసేన అభివృద్ధికి కృషి చేయాలే తప్ప వర్గపోరు పార్టీకి ఓటమి చేకూర్చకూడదని పవన్ సూచించారు.












Click it and Unblock the Notifications