ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఈసీకి జనసేన ఫిర్యాదు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు, నేతలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈసీకి జనసేన ఫిర్యాదు చేసింది. భీమవరంలో ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది.
మోడల్ కోడ్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ రావు తెలిపారు.

ఈసీకి టీడీపీ ఫిర్యాదులు
ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల సీఈఓకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒంగోలులో పనిచేస్తున్న సీఐలు ఎం.లక్ష్మణ్, భక్తవత్సల రెడ్డిలపై ఫిర్యాదు చేసింది. మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగిన వ్యవహారంలో భక్తవత్సల రెడ్డి అక్కడే ఉన్నారని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. భక్తవత్సలరెడ్డిని, లక్షణ్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని కోరుతూ సీఈఓకి టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు.
ఇలాంటి వ్యక్తులు విధుల్లో ఉంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్తూరులో గంగిరెడ్డి అనే సీఐ పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తారని, కాబట్టి ఆయనను కూడా తప్పించాలని టీడీపీ కోరింది. అదే విధంగా సాక్షి పత్రికలో అభ్యర్ధులపై వస్తున్న ఆర్టికల్స్ను పెయిడ్గా పరిగణించాలని విన్నవించింది. ముఖ్యమంత్రిపై దాడి చేశారనే అభియోగంపై సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని, ఈ ఘటనపై 307 సెక్షన్ కేసు ఎలా పెడతారని టీడీపీ ప్రశ్నించింది.
సతీష్ను మరో కోడికత్తి శీనుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు తగిన ఏర్పాట్లు చేయడం లేదంటూ ఎస్ఈసీకి వర్ల రామయ్య లేఖ రాశారు. ఎన్నికల డ్యూటీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫామ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications