వైసీపీలోకి జనసేన కోనసీమ కీలక నేత..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ముహూర్తాలను చూసి ముఖ్య నేతలు నామినేషన్ల దాఖలుకు నిర్ణయిస్తున్నారు. ఇటు ప్రచారం హోరెత్తుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ నేతల జంపింగ్స్ పెరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గోదావరి బలా బలాలే గెలుపును డిసైడ్ చేయనున్నాయి. ఈ సమయంలో కోనసీమ జనసేన నేత వైపీపీలో చేరుతున్నారు.
గోదావరిలో కొత్త లెక్కలు
గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు గెలవటానికి లేదని పవన్ శపథం చేసారు. గోదావరిలోనే మెజార్టీ సీట్లు గెలవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. జనసేనలో సుదీర్ఘ కాలం పని చేసి సీట్లు రాకపోవటంతో పలువురు నేతలు జనసేన వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ముమ్మిడివరం, అమలాపురం నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడలో తూర్పు, పశ్చిమ ఇంఛార్జ్ లు వైసీపీలో చేరారు. ఇక, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు.

వైసీపీలోకి బొంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజోలు అభ్యర్దిగా పోటీ చేసిన రాజేశ్వరరావు పైన జనసేన అభ్యర్ది రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. రాపాక వైసీపీలోకి రావటంతో బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరారు. ఆయన ఈ ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన సీటు ఆశించారు. కానీ, రాజోలు బీఫామ్ రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ కు అందజేశారు పవన్ కల్యాణ్. దీంతో రాజేశ్వరరావు జనసేన వీడాలని నిర్ణయించారు.
కొత్త సమీకరణాలు
రాజేశ్వర రావుకు సీటు ఇవ్వకపోవటం పైన ఆయన మద్దతు దారులు ఆందోళన చేసారు. ఇక, ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరాలని రాజేశ్వర రావు నిర్ణయించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కాకినాడలో సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నారు. దీంతో...జనసేన తమకు గట్టి పట్టు ఉన్న ప్రాంతంగా చెప్పుకుంటున్న కోనసీమలో లెక్కలు మారుతున్నాయి. పలువురు పార్టీ ముఖ్యులు పార్టీ మారటంతో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications