పిఠాపురం దెబ్బ: జనసేన నేతకు వైసీపీ కండువా కప్పిన జగన్
YS Jagan: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి వలసల సెగ తాకుతోంది. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చు పెట్టింది.
పొత్తులో భాగంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు వదలుకోవడం వల్ల ఏ స్థాయిలో నిరసన జ్వాలలు చెలరేగుతోన్నాయనేది తెలిసిందే. తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశిస్తోన్న మాజీ ఎమ్మెల్యేే ఎస్వీఎస్ఎన్ వర్మ, ఆయన అనుచరులు వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్పై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

అదే సమయంలో- ఈ జిల్లాకే చెందిన కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన తనయుడు గిరి.. వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం చర్చనీయాంశమైంది. గతంలో జనసేనలో చేరడానికి ఆయన ప్రయత్నాలు సాగించినప్పటికీ- టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడటం వల్ల అది సాధ్యపడలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
వైఎస్ఆర్సీపీలో ముద్రగడ చేరిక ప్రభావం.. జిల్లా రాజకీయాలను, ప్రత్యేకించి- ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గ ఓటుబ్యాంకునను ప్రభావితం చేసినట్టయింది. ముద్రగడ బాటలో మరికొందరు నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తోన్నారు కూడా.
ఈ క్రమంలో- ఏలూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నవుడు వెంకటరమణ అలియాస్ రమణ బాబు.. వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాను కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వెంకటరమణ సొంత నియోజకవర్గం.. ఉంగుటూరు. 2019 నాటి ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఆరు శాతానికి పైగా ఓట్లను సొంతం చేసుకున్నారు. ఈ సారి ఆయనకు జనసేన నుంచి టికెట్ దక్కట్లేదు. ఫలితంగా- వైసీపీకి జైకొట్టారు.












Click it and Unblock the Notifications