Holidays: స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు!
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఒక కీలక అప్డేట్. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పలు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా రేపు (శుక్రవారం, జూలై 10) రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి. అయితే, ఈ బంద్ కారణంగా కొన్ని స్కూళ్ల విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసి రావడం విశేషం.
నిజానికి, ఈ ఏడాది వేసవి సెలవులను పొడిగించిన కారణంగా తలెత్తిన పనిదినాల కొరతను భర్తీ చేయడానికి, ఈ నెలలో వచ్చే రెండో శనివారాన్ని వర్కింగ్ డే (పనిదినం)గా మారుస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఆరోజూ సెలవు ప్రకటించాయి. దీంతో రేపు శుక్రవారం బంద్ కావడం, శనివారం కొన్ని స్కూళ్లు సెలవు ఇవ్వడం, ఆ మరుసటి రోజు ఆదివారం సాధారణ సెలవు కావడంతో.. విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ దొరికినట్లయింది.

అసలు విద్యార్థి సంఘాల డిమాండ్లు ఏమిటి?
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాల నేతలు ఈ నిరసనకు దిగారు. వారి ముఖ్యమైన డిమాండ్లు ఇలా ఉన్నాయి
- ప్రభుత్వ స్కూళ్ల తగ్గింపుపై అభ్యంతరం: ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటి సంఖ్యను కేవలం 4 వేలకు కుదించాలని ప్రభుత్వం చూస్తోందని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
- ఫీజుల నియంత్రణ చట్టం: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను అరికట్టేందుకు తక్షణమే కఠినమైన నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి.
- మంత్రి కేటాయింపు & పోస్టుల భర్తీ: విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించడంతో పాటు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
- సొంత భవనాలు & ఉచిత ప్రవేశాలు: అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి. విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలి.
- మధ్యాహ్న భోజనం & దోపిడీ నియంత్రణ: ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అలాగే ప్రైవేటు స్కూళ్లలో విచ్చలవిడిగా పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయించి తల్లిదండ్రులను దోచుకునే విధానాన్ని అడ్డుకోవాలి.
ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రేపు చేపట్టే విద్యాసంస్థల బంద్కు అన్ని యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించి విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications