అతని సమాధి పక్కనే ఖమేనీ ఖననం.. మష్హద్ నగరం ఎంత పవర్ ఫుల్ అంటే!
మధ్యప్రాచ్య రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. ఆయన మరణించిన నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇటు భద్రతా కారణాలు, అటు అంతర్జాతీయ యుద్ధ ఉద్రిక్తతల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ అంతిమ సంస్కారాలు చివరకు ఈశాన్య ఇరాన్ నగరమైన మష్హద్లోని పవిత్ర ఇమామ్ రెజా క్షేత్రంలో జరగనున్నాయి.
ఇస్లామిక్ సంప్రదాయానికి భిన్నంగా..
సాధారణంగా ఇస్లామిక్ షరియా సంప్రదాయం ప్రకారం మరణించిన 24 గంటల్లోపే అంత్యక్రియలు పూర్తి చేయాలి. కానీ, ఖమేనీ మరణానంతరం మధ్యప్రాచ్యంలో ముదిరిన యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు నెలల పాటు ఆయన భౌతికకాయాన్ని రసాయన ఎంబామింగ్ ప్రక్రియ లేకుండా, కేవలం మెడికల్ రిఫ్రిజిరేషన్ పద్ధతుల్లో సురక్షితంగా ఉంచారు. యుద్ధాలు, అత్యవసర పరిస్థితుల్లో పార్థివ దేహం చెడిపోకుండా ఇలాంటి అధునాతన శీతలీకరణ పద్ధతులను ఉపయోగించడం షియా ఇస్లామిక్ చట్టాల ప్రకారం అనుమతించదగినదేనని మత పెద్దలు స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్, ఇరాక్ దేశాల్లోని ప్రముఖ ధార్మిక నగరాల మీదుగా సప్తాహ యాత్ర నిర్వహించిన అనంతరం భౌతికకాయాన్ని మష్హద్కు తరలించారు.

సుదీర్ఘ ఆలస్యానికి గల అంతర్జాతీయ, దేశీయ కారణాలు
ఫిబ్రవరిలో ఖమేనీ మరణించిన సమయంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ సమయంలో భారీ ఎత్తున ప్రజలు గుమికూడి అంత్యక్రియలు నిర్వహిస్తే, అది శత్రు దేశాల వైమానిక దాడులకు మార్గం సుగమం చేస్తుందని ఇరాన్ రక్షణ వర్గాలు ఆందోళన చెందాయి. ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది.
వీటికి తోడు దేశీయంగా తలెత్తిన రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ వ్యతిరేక వర్గాల నిరసనలు కూడా ఈ జాప్యానికి కారణమయ్యాయి. గత జూన్ నెలలో ఇరుపక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాతే పరిస్థితులు కొంత అదుపులోకి రావడం, శాంతియుత వాతావరణం ఏర్పడటంతో ఇరాన్ ప్రభుత్వం ఈ జాతీయ అంతిమ యాత్రను ప్రణాళికాబద్ధంగా ప్రారంభించింది.
అంతిమ సంస్కారాలకు 'మష్హద్' నగరమే ఎందుకు?
ఖమేనీ అంత్యక్రియలు రాజధాని టెహ్రాన్ లేదా ప్రముఖ మత కేంద్రమైన కోమ్ నగరాల్లో జరుగుతాయని మొదట భావించారు. కానీ, వ్యూహాత్మకంగా ఖమేనీ జన్మస్థలమైన 'మష్హద్' నగరాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. షియా ముస్లింలకు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం 'ఇమామ్ రెజా క్షేత్రం' ఇక్కడే ఉంది. ఇరాన్ దేశంలో ఖననం చేయబడిన ఏకైక షియా ఇమామ్ అయిన ఇమామ్ రెజా సమాధి పక్కనే ఖమేనీకి చోటు కల్పించడం అత్యంత గౌరవప్రదంగా, పవిత్రమైనదిగా ఇరాన్ భావిస్తోంది.
ఇరాన్, ఇరాక్ దేశాల మీదుగా చారిత్రాత్మక యాత్ర
గతంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు కూడా ఇదే పవిత్ర క్షేత్రంలో జరిగాయి. ఈ అంతిమ సంస్కారాల కంటే ముందు, ఖమేనీ పార్థివ దేహానికి ఇరాన్లోని టెహ్రాన్, కోమ్ నగరాలతో పాటు.. పొరుగు దేశమైన ఇరాక్లోని అత్యంత పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాలకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండు దేశాల పరిధిలో కొన్ని వారాల పాటు విస్తరించిన ఈ చారిత్రాత్మక అంతిమ యాత్ర ముగింపునకు రావడం.. ఇరాన్ రాజకీయ, ధార్మిక ఇతిహాసంలో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లయింది.














Click it and Unblock the Notifications