IND vs ENG: ప్చ్.. వైభవ్ మళ్లీ విఫలం: టీమిండియా ఘోర పరాజయం
IND vs ENG: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా ఆట ఏ మాత్రం మారలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇటీవల 0-2తో ఐర్లాండ్ తో సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లాండ్ కు సిరీస్ సమర్పించుకుంది.
బ్రిస్టల్ లోని కౌంటీ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20 భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49 బంతుల్లో80*) ఒక్కడే పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మిగతా బ్యాటర్లందరూ విఫలం కావడంతో భారత్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.

అనంతరం 159 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 13.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రూక్ (35 బంతుల్లో 79*), ఫిల్ సాల్ట్(42 బంతుల్లో 59*) చెలరేగడంతో ఇంగ్లాండ్ సునాయాసంగా విజయ తీరాలను తాకింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 3-0 ఆధిక్యంలో ఉంది. ఈజీగా సిరీస్ దక్కించుకుంది.
టీమిండియాకు ఏమైంది?
నాలుగో టీ20లోనూ టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. అగ్రెసివ్ క్రికెట్ అని చెప్పుకున్న టీమిండియా.. గత కొన్ని మ్యాచ్ల నుంచి బ్యాట్ ఝులిపించలేకపోతోంది. టీమిండియా ఏ రకంగానూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ మాత్రమే నిలబడడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(10 బంతుల్లో 15 పరుగులు) త్వరగానే ఔటయ్యి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(16), ఇషాన్ కిషన్(4) కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే కాస్త ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ శివమ్ దూబే(22) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లో తిలక్ వర్మ(11), వాషింగ్టన్(5) ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా ఏ దశలోనూ రాణించకుపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఐర్లాండ్ జట్టుతోనూ సిరీస్ కోల్పోవడం.. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ కోల్పోవడం కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. జట్టులో ఎన్ని మార్పులు చేసిన ఫలితం మాత్రం అదే కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఐదో టీ20 మ్యాచ్ లోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.
సంక్షిప్తంగా స్కోర్లు:
టీమిండియా- 158/7(20 ఓవర్లలో)
ఇంగ్లాండ్ -159/1(13.5 ఓవర్లలో)












Click it and Unblock the Notifications