తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!
ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక మరోసారి అధికార కూటమికీ, విపక్ష వైఎస్సార్సీపీకి మధ్య వైరానికి కేంద్రంగా నిలిచింది. ఈ మధ్యే ఖాళీ అయిన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైసీపీ తమ అభ్యర్ధిగా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును (Tumati Madhava Rao) ఎంపిక చేసింది. అయితే ఆయనపై పోటీగా కూటమి అభ్యర్ధిని నిలబెడుతుందని భావించినా, అలా జరగలేదు. దీంతో తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ అయిపోయారు.
ఇవాళ శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నికను ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధికారికంగా ప్రకటించారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు అంతా పోడియం వద్దకు చేరుకుని తూమాటి మాధవరావును సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం ఆయన ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు తెలిపారు. దీంతో పోడియం అంతా వైసీపీ ఎమ్మెల్సీల సందడి కనిపించింది. అదే సమయంలో కూటమి ఎమ్మెల్సీలు మాత్రం సభలో లేకుండా బయటికి వెళ్లిపోయారు. తూమాటిపై అభ్యర్ధిపై నిలబెట్టకపోవడం, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వంటి పరిణామాల మధ్య కూటమి ఎమ్మెల్సీల చర్య ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇలా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఏకగ్రీవ ఎన్నికైన వేళ ఆయన్ను అభినందించకుండా, కూటమి ఎమ్మెల్సీలు సభను వదిలి బయటికి వెళ్లిపోవడం దుస్సాంప్రదాయమంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేశంలో, ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ఏర్పాటైన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని బొత్స గుర్తుచేశారు. ఐదు నిమిషాల క్రితం మంత్రి నాదెండ్ల నిబంధనల గురించి మాట్లాడారని, ఇప్పుడు కూటమి సభ్యులు వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు. సభ మీద, సభా కార్యకలాపాల మీద కూటమి ఎమ్మెల్సీలకు ఉన్న గౌరవాన్ని ఇది బయటపెడుతోందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వారికి వీళ్లు ఏం సందేశం ఇస్తారని బొత్స ప్రశ్నించారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదన్నారు.













Click it and Unblock the Notifications