రాక్షసులా: కెసిఆర్పై జవదేకర్ ఫైర్, బిజెపిలోకి కావూరి
ఒంగోలు: భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు భారత్, పాకిస్తాన్లు కావని ఆయన అన్నారు.
తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని చూసి తెరాస భయపడుతోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజల పైన కెసిఆర్ ఇష్టారీతిగా మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. మోడీని కెసిఆర్ తిడితే తెలంగాణ ప్రాంతంలో ఐదు సీట్లు కోల్పోతారని హెచ్చరించారు.

తమ పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేది కాదన్నారు సీమాంధ్ర ప్రజలను కెసిఆర్ రాక్షసులు అనడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు సీమాంధ్రకు నీళ్లివ్వమని, వెళ్లగొడతామని చెప్పడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ, సీమాంధ్రలు భారత్లో అంతర్భాగమన్నారు. కెసిఆర్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
రేపు, ఎల్లుండి సీమాంధ్రలో మోడీ సభలు ఉంటాయన్నారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు బిజెపిలో చేరుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులు కూడా మోడీ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు.












Click it and Unblock the Notifications