ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి రెండోరోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.15 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. భారత్ స్టాండర్డ్స్ (బీఎస్)-3 ప్రమాణాలు కలిగిన లారీలను బీఎస్-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అనంతపురం, హైదరాబాద్, తాడిపత్రిలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో, కుటుంబీకుల ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి.
వాటి నుంచి లభ్యమైన సమాచారం ఆధారంతో ఈడీ నోటీసులు జారీచేసింది. ఈడీ జారీచేసిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు ప్రభాకర్ రెడ్డి వరుసగా రెండురోజులపాటు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయానికి వచ్చారు. అధికారులు మనీలాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. మొదటిరోజు ఎనిమిది గంటలు ప్రశ్నించారు. రెండోరోజు విచారణకు కూడా రావాలని చెప్పడంతో ఆయన హాజరయ్యారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, రాష్ట్ర విభజన తర్వాత వారిద్దరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రి నుంచి వారి వారసులు పోటీచేసి ఓటమిపాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తాడిపత్రి నుంచి టీడీపీ గెలవడంతో ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. మొదటి నుంచి సోదరులిద్దరూ తరుచుగా వార్తల్లో నిలిచేవారు.
మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులకు రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వారి వారసులు కాకుండా ఇద్దరు నేతలనే పోటీచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరుతున్నారు. అనంతపురం అర్బన్ నుంచి దివాకర్ రెడ్డి కుమారుడు, తాడపత్రి నుంచి ప్రభాకర్ రెడ్డి వారసుల రంగంలోకి దిగడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. అభ్యర్థులనే ప్రకటించినప్పుడే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications