చంద్రబాబుకు పార్టీలోనే చిక్కు!: కెఈ తర్వాత జెసీ 'ఉద్యమ' హెచ్చరిక
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాకు మీద షాకు తగులుతోంది. సొంత పార్టీ నేతలు పలు నిర్ణయాలతో విభేదిస్తున్నారు. అదే సమయంలో రాయలసీమ అంశాన్ని ఆ ప్రాంత టిడిపి నేతలు పదేపదే తెరపైకి తీసుకు వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రాయలసీమకు ఎక్కువ నష్టం జరిగిందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం అన్నారు. విభజన అనంతరం ఇస్తున్న ప్యాకేజీలో రాయలసీమకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లేదంటే రాయలసీమలో పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాయలసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. రాయలసీమను విస్మరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇప్పటికే స్వయంగా ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కొద్ది నెలల క్రితం మాట్లాడుతూ.. చంద్రబాబు తమ ప్రాంతం పైన అంతగా దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. దీనికి సీఎం చంద్రబాబు ఆ తర్వాత కౌంటర్ ఇచ్చారు.
తాజాగా, గురువారం నాడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అవసరం లేదన్నారు. భూసేకరణ అంశం తన శాఖ పరిధిలో లేదన్నారు. రాజధానికి అవసరమైన భూముల సేకరణ ప్రకటన జారీపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత ప్యాకేజీ అడిగారో తెలియదుగానీ.. రాయలసీమ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. రాయలసీమ అభివృద్ధికి టిడిపి ఆ ప్రాంత నేతలు ప్రత్యేక ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నారు. ఇది చంద్రబాబుకు తలనొప్పి అని చెప్పవచ్చు.