పోలీసులూ... మేం పవర్లోకి రావద్దని మొక్కుకోండి.. వస్తే జరిగేదదే .. జేసీ బ్రదర్ సంచలనం
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని ఆయన గట్టిగానే చెప్పారు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అందరి ముందు పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు . ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ విషయంలో, తమ అనుచరుల విషయంలో ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు కచ్చితంగా భవిష్యత్ లో తాము అధికారంలోకి వస్తే జైలుకు వెళ్ళాల్సిందే అని చెప్పారు. తాము పవర్లోకి రాకూడదని, పోలీసులు దేవుడ్ని గట్టిగా మెక్కుకోండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు . పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టి లోపలెయ్యడం తప్ప ఇంకేం చెయ్యగలరని ప్రశ్నించారు. అంతకు మించి వారు ఏమి చెయ్యలేరని, కార్యకర్తలందరకి టీడీపీ బాసటగా ఉంటుందని స్ఫష్టం చేశారు.

జరుగుతోన్న అన్యాయాలను ఎదుర్కోడానికి అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం సిద్దమన్నారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినందుకు ఎస్పీ, డీఎస్పీతో పాటు సీఐలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చాం అని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఎప్పటికీ ఇలాగే ఉంటామని అనుకోవద్దు అని ఆయన హెచ్చరిక జారీ చేశారు.












Click it and Unblock the Notifications