కెసిఆర్ టెర్రరిస్టు: జీవితా రాజశేఖర్, నరుకుతరు: విహెచ్
హైదరాబాద్/ మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు టెర్రరిస్టులా వ్యవహరిస్తున్నారని సినీ దంపతులు జీవితా రాజశేఖర్ దంపతులు వ్యాఖ్యానించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో బిజెపి అభ్యర్థి రఘునందనరావు తరఫున వారు ప్రచారం నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఇప్పటికీ విద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్న కెసిఆర్ టెర్రరిస్టును మరిపిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
కెసిఆర్కు అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేస్తారని వారన్నారు. కొద్ది రోజులు ఉద్యమం చేసి ఢిల్లీకి వెళ్లి డబ్బు సంచులు తెచ్చుకుని ఫామ్హౌస్లో పడుకునే కెసిఆర్కు ప్రజల బాధలు తెలియవని వారన్నారు. సినీ నటులుగా తమకు ఏ పార్టీ అవసరమూ లేకున్నా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ కోసం ప్రచారం చేస్తున్నట్లు వారన్నారు.
తెలంగాణ రాకపోతే తల నరుక్కుంటా అని పలుమార్లు ప్రకటించిన కెసిఆర్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తల నరుకుతారని కాంగ్రెస్నేత వి.హన్మంతరావు అన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, బిసి నేత వీజీఆర్ నారగోనిలతో కలిసి సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణను తీసుకురాకపోతే తల నరుక్కుంటా అని పలు సందర్భాల్లో చెప్పాడని, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిందని, ప్రజలే ఆయన తలను ఎన్నికల్లో నరుకుతరని విహెచ్ అన్నారు.
తెరాసకు ఓటు వేయవద్దని, వేస్తే అమరుల పాపం ప్రజలకు చుట్టకుంటుందని హెచ్చరించారు. కెసిఆర్ తెరాసను ప్రైవేటు కంపెనీగా మార్చేశారని నారగోని ఆరోపించారు. కెసిఆర్ తన మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రధాన హామీలన్నింటిని నెరవేరుస్తామని ఎఐసిసి ఎస్సీ సెల్ జాతీయాధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు.