నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !!
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. వీటి తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. టీటీడీ ఉన్నతాధికారులు పలుదఫాలుగా సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టారు. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయక్కడ.
ఈ నెల 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట ఆలయంలో వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.

ఇందులో భాగంగా నేడు హరిధ్రా ఘటనం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. హరిద్రా ఘటనం అంటే.. పసుపు దంచే కార్యక్రమం. దీంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పసుపు కొమ్ములను పోసి సాంప్రదాయ బద్దంగా రోలులో దంచుతారు.
దీంతో శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. దంచిన పసుపును ఉత్సవరులు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో తలంబ్రాల తయారీకి ఉపయోగిస్తారు. కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందు వచ్చే మంగళవారం నాడే తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం 8 గంటల నుండి 11:30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధులు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. 11:30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.












Click it and Unblock the Notifications