సత్తా బాబుకే,చూస్తా: ప్రచారమంటూ సైకిలెక్కడంపై ఆనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారంపై మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం స్పందించారు. తాము టిడిపిలో చేరుతున్నామనేవి కేవలం ఊహాగానాలేనని చెబుతూనే... చేరే అవకాశాలను ఆయన కొట్టి పారేయలేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తాము టిడిపిలో చేరుతారనే ప్రచారం కేవలం ఊహాగానాలేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన వస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. తమకు చంద్రబాబుతో 35 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను పాలించే సత్తా చంద్రబాబుకే ఉందని చెప్పారు.
కాగా, కాంగ్రెసులో హల్చల్ చేస్తూ వచ్చిన ఆనం సోదరులు టిడిపిలోకి జంప్ చేస్తారని ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి రాంనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని పుకార్లు షికార్లు చేశాయి.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సమీప భవిష్యత్తులో కూడా బాగుపడే సూచనలు లేకపోవడంతో టడిపిలో చేరడానికి వారు నడుం బిగించారని అంటున్నారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా అందుకు సుముఖంగానే వున్నారని అంటున్నారు. ఆనం బ్రదర్స్ తమ పార్టీలో చేరితే నెల్లూరు జిల్లాలో తిరుగు ఉండదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని మరింత బలంగా ఎదుర్కోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.